భార్య పాశవికం: తాళ్ళతో కట్టేసి భర్త మర్మాంగం కోసి కడతేర్చిన కసాయితనం
భర్తతో విసిగి వేసారిపోయిన ఓ ఇల్లాలు అత్యంత పాశవికంగా భర్తను కడతేర్చిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. సినిమా ఫక్కీలో మంచానికి కట్టేసి భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసి ప్రాణం తీసింది ఓ భార్య. గత కొంత కాలంగా భర్త తాగుడుకు బానిస కావడం, వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం వంటి కారణాలతో విరక్తి చెందిన భార్య అత్యంత కిరాతకంగా మర్మాంగాన్ని కోసి కడతేర్చింది. ఆపై బంధువులకు సమాచారం అందించి పోలీసులకు లొంగిపోయింది.
మద్యానికి బానిసై , మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త
పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఊరగుంట కొత్తపేటకు చెందిన కఠారి అప్పారావు, లక్ష్మి దంపతులు. వారికి 13 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. తెలంగాణాలోని దమ్మపేట గ్రామానికి చెందిన లక్ష్మితో అప్పారావుకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ట్రాక్టర్ నడుపుతూ అప్పారావు జీవనం సాగించేవాడు. కొంతకాలం పాటు వారి కాపురం సజావుగానే సాగినా గత కొంత కాలంగా అప్పారావు మద్యానికి బానిసయ్యాడు. భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాదు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని నిత్యం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.
విసిగిపోయిన భార్య .. దారుణంగా హతమార్చిన తీరు
ఇక దీనిపై లక్ష్మీ పలుమార్లు గ్రామపెద్దలతో పంచాయతీలు పెట్టింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా అప్పారావు తీరు ఏమాత్రం మారకపోవడంతో అప్పారావు పెట్టే టార్చర్ తట్టుకోలేక హతమార్చాలని నిర్ణయించుకుంది. అయిదేళ్లుగా గొడవలతో విసిగి పోయిన లక్ష్మి భర్తను హతమార్చడానికి చేసుకున్న ప్లాన్ లో భాగంగా కుమార్తెను పుట్టింటికి పంపించింది. మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చిన భర్త మంచంపై పడుకొని నిద్రపోగా అదే అదునుగా తన ప్లాన్ వర్కవుట్ చేసింది.
మంచానికి కట్టేసి మర్మాంగం కోసి భర్తను హతమార్చిన భార్య
తాళ్లతో అతని కాళ్ళు చేతులు కట్టేసింది. మెడకు మరో తాడు బిగించింది. నడుము భాగంలో చీరతో మంచానికి కట్టేసింది. ఇక ఆపై బ్లేడ్ తీసుకుని అప్పారావు మర్మాంగాన్ని కోసి పారేసింది. అప్పారావు చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పి పారిపోయింది. ఇక ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఎంతగా వేదించినా భార్య చేసిన దారుణం మాత్రం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అత్యంత పాశవికంగా భర్తను హతమార్చిన ఆమె మర్మాంగాన్ని కోసిన దారుణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.