టాయ్లెట్స్ కట్టించలేదని భర్తతో గొడవ: మహిళ ఆత్మహత్య
చిత్తూరు: మరుగుదొడ్డి కట్టించలేదని ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. పట్టణంలోని గౌతమినగర్కు చెందిన ప్రసాద్బాబుకు భార్య సరస్వతి (35), కుమారులు లోకేష్ (16), హరీష్ (14) ఉన్నారు.
వీరి ఇంటికి మరుగుదొడ్డి లేకపోవడంలో బహిర్భూమికి పట్టణ శివార్లలోకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించాలని సరస్వతి భర్తను కోరింది. నిర్మాణానికి డబ్బు లేదని అతను చెప్పడంతో మూడురోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి భర్త, పిల్లలు ఆమె కోసం గాలిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తట్టివారిపల్లె చెరువు కట్టకింద ఉన్న బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్వస్వతి మృతిలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
యువకుడి అనుమానాస్పద మృతి
కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన కిష్టయ్య, చెన్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ(22) ఆర్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం గాలించగా సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాల్లో విగత జీవిగా కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.