వరకట్న వేధింపులు: పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య
మృతురాలి బంధవుల కథనం ప్రకారం.. వెలుతుర్లపల్లి గ్రామానికి చెందిన తౌట్పర్తి ప్రవీణ్రావుకు, గోదావరిఖనికి చెందిన వెలిశాల స్వప్న(27)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు వర్షిత్, అర్జున్ ఉన్నారు. అయితే పెళ్లయిన మూడేళ్ల నుంచి ప్రవీణ్ అదనపు వరకట్నం కోసం స్వప్నను తరచూ వేధింపులకు గురి చేస్తూ, ఆమెను పుట్టింటికి పంపించేవాడు.
అదనపు కట్నం కోసం వారి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవని బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులతోపాటు స్వప్న, ప్రవీణ్ రావులు మేడారం జాతరకు వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. ప్రవీణ్, స్వప్నల మధ్య ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున స్వప్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు చెప్పారు.
కుటుంబ సభ్యులు స్వప్నను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సోమవారం తన పెళ్లి రోజును సంతోషంగా గడుపుకోవాల్సి ఉండగా స్వప్న బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ కూతురు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.