‘10’లోనే ప్రేమ, ప్రియుడి మోజులో పడి వివాహిత దారుణం: భర్తను హత్య చేసి..
జిల్లాలో దారుణ ఘటన చోటు చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత.. అతడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
అనంతపురం: జిల్లాలో దారుణ ఘటన చోటు చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత.. అతడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసులు విచారణలు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
‘పది’లోనే ప్రేమ..
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి శుక్రవారం వెల్లడించారు. ప్యాపిలికి చెందిన వెంకటేశ్వరికి పదో తరగతి చదివేటప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన రాజేశ్తో పరిచయం ఉండేది. అప్పట్నుంచే ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే, వయసులో వెంకటేశ్వరి కంటే రాజేశ్ చిన్నవాడు కావడంతో పెద్దలు సమ్మతించలేదు.
మరో వ్యక్తితో పెళ్లి.. ఐనా..
అనంతరం వైటీ చెరువుకు చెందిన సుధాకర్తో వెంకటేశ్వరి వివాహం చేశారు. పెళ్లి తర్వాత వీరు గుత్తి పట్టణంలోని కురబవీధికి మకాం మార్చారు. వీరికి ఒక బాలుడు కలిగాడు. కాగా, వివాహానంతరం కూడా ప్రియుడు రాజేశ్తో వెంకటేశ్వరి సంబంధం కొనసాగిస్తుండేది.
అక్రమ బంధం బట్టబయలవడంతో..
ఇటీవలే వారి అక్రమ బంధం గుట్టు రట్టవడంతో వెంకటేశ్వరితో భర్త సుధాకర్ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకుంటేనే వివాహం చేసుకోవచ్చని వెంకటేశ్వరికి రాజేశ్ చెప్పాడు. ఆ మేరకు హత్యకు కుట్రపన్నారు. కర్నూలుకు చెందిన ధాబాలో పని చేస్తున్న కిరాయి హంతకుడు శివకుమార్.. రాజేశ్కు పరిచయమయ్యాడు. ఓ వ్యక్తిని హత్య చేయాలని రాజేశ్ చెప్పడంతో శివకుమార్ సరేనన్నాడు. దీంతో సెప్టెంబర్ 16న రాత్రి 12 గంటల సమయంలో రాజేశ్, శివకుమార్ను వెంకటేశ్వరి ఇంటిపైకి తీసుకెళ్లింది.
అంతమొందించి..
ఇంట్లో నిద్రపోతున్న సుధాకర్ను ముగ్గురూ కలిసి డంబెల్తో కొట్టి, హత్య చేశారు. అది దొంగల పనిగా నమ్మించేందుకు ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలు, రూ.19 వేల నగదును ప్రియుడు రాజేశ్కిచ్చి వెంకటేశ్వరి పంపించేసింది. అనుమానం రాకుండా తనను కట్టేసి, వెళ్లమని చెప్పింది. తరువాత దొంగలు పడ్డారని అరచింది. తన భర్తను హత్య చేసి, రూ.5 లక్షల నగదు, 30 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లారంటూ వెంకటేశ్వరి పోలీసులకు తెలిపింది.
విచారణలో అసలు విషయం..
కాగా, ప్రాథమిక విచారణలోనే పోలీసులు వెంకటేశ్వరిపై అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక విచారణ వేగవంతం చేశారు. హత్య కేసును స్థానిక సీఐ, ఎస్ఐ తమదైన శైలిలో విచారించారు. దీంతో మిస్టరీ వీడింది. శుక్రవారం వెంకటేశ్వరి, రాజేశ్, శివకుమార్ను అరెస్టు చేసి, 15 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు.