ఆటో డ్రైవర్ ఘాతుకం: అక్క ఇంటికెళుతున్న యువతి కిడ్నాప్, గ్యాంగ్రేప్
విజయనగరం: ఓ వైపు చిన్నారులు, మహిళలు, యువతులపై లైంగి దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా వారిపై జరిగే వేధింపులు మాత్రం ఆగడం లేదు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన దివ్యాంగురాలైన మహిళను గమ్యస్థానం చేర్చకుండా మరో చోటికి తరలించి ఆటో డ్రైవర్ తోపాటు అతడి మరో ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అటుగా వెళుతున్న ఓ వ్యక్తి బాధితురాలి అరుపులతో ఘటనా స్థలం వైపు వెళ్లగా.. ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని సదరు వ్యక్తి విజయనగరం ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్క ఇంటికి వెళదామని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగకు చెందిన దివ్యాంగురాలైన యువతి విజయనగరం పూల్బాగ్లో ఉంటున్న తన అక్క ఇంటికి ఆదివారం రాత్రి బయలుదేరింది. కోట కూడలి వద్ద రాత్రి 8గంటలకు ఆటో ఎక్కింది. పూల్బాగ్లోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఆమె దిగాల్సి ఉండగా ఆటో డ్రైవర్ ఆపలేదు.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..
ఈ క్రమంలో, యువతి ప్రతిఘటించగా డ్రైవర్ తోపాటు అతడి మరో ఇద్దరు స్నేహితులు యువతి నోరు నొక్కి పట్టారు. అక్కడి నుంచి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీటీసీ రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతి కేకలు విని..
అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి యువతి కేకలు విని ఘటనా స్థలం వైపు రావడంతో నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఓ ప్రయాణికుడి సహాయంతో ఇంటికి చేరిన దివ్యాంగురాలిని బంధువులు ఆస్పత్రికి తరలించారు.
కఠినంగా శిక్షించాలి
జరిగిన ఘటనపై నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచారం కింద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు.