భర్తను వదిలేసి పుట్టింట్లోనే..: ప్రియుడితో కలిసి అన్నను చంపేసిన చెల్లి
గుంటూరు: ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తన తోబుట్టువైన అన్నను హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి ఇద్దరు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.
వివాహమైనా పుట్టింట్లోనే అన్నతోపాటు చెల్లి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని బేతపూడి పరిధి రేగులగడ్డకు చెందిన గంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు పోతురాజు(40), ఆదిలాక్షి సంతానం. పోతురాజుకు సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన వీరమ్మతో వివాహం జరిగింది. ఇతడు మద్యానికి బానిసవడంతో వీరమ్మ పుట్టింట్లో ఉంటోంది. ఇక ఆదిలక్ష్మికి అమరావతి మండలం అత్తలూరుకు చెందిన తిరులకొండ నాగరాజుతో వివాహమవగా, పలుమార్లు గొడవలు జరగడంతో ఆమె కూడా పుట్టింటికి వచ్చేసింది.
చెల్లి వివాహేతర సంబంధం గురించి తెలిసి..
ఈ క్రమంలో ఆదిలక్ష్మికి రేగులగడ్డ గ్రామానికే చెందిన చారల సాంబయ్యతో పరిచేయం ఏర్పడింది. ఆ పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన పోతురాజు.. ఆదిలక్ష్మిని ఇంటి నుంచి వెళ్లాలని ఒత్తిడి పెంచాడు. ఆస్తి ఇవ్వాలంటూ ఇంట్లో వారిని బెదిరింపులకు గురిచేస్తూ వేధించేవాడు. కాగా, సెప్టెంబర్ 19న రాత్రి పోతురాజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆస్తి కావాలని ఇంట్లోవారితో గొడవపెట్టుకున్నాడు. మొదట సాంబయ్యతో పోతురాజు గొడవపడ్డాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పోతురాజు కిందపడ్డాడు. అతని తలకు గాయమైంది.
ప్రియుడితో సాయంతో అన్నను హతమార్చింది
ఆ తర్వాత రాత్రి కావడంతో అంతా నిద్రపోయారు. అయితే, తన విషయం తెలియడంతో తననేమైనా చేస్తాడేమోనని ప్రియుడు సాంబయ్యతో కలిసి పోతురాజును చంపాలని నిర్ణయించుకుంది ఆదిలక్ష్మి. నిద్రపోతున్న పోతురాజు తలపై రోకలిబండతో ఆదిలక్ష్మి కొట్టింది. తలకు తీవ్రగాయంతో పోతురాజు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదిలక్ష్మితోపాటు ఆమె ప్రియుడు సాంబయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.