పెళ్లయ్యాక మరొకరితో.. ఫేస్ బుక్ ప్రేమ : నిజం తెలియడంతో ఘోరం
మదనపల్లె : ఆమె ఓ వివాహితురాలు.. ఆ విషయం దాచిపెట్టి మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అసలు విషయం తెలియని ప్రియుడు ఆమెకు చాలాసార్లు నగదు ఇవ్వడంతో పాటు ఓ వాహనం కూడా కొనిపెట్టాడు. అయితే కొద్దిరోజులకు విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో ప్రియుడితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్దమైంది. ఇదే క్రమంలో ప్రియుడిని కలిశాక ఆమె ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం యనమడుగుకు చెందిన గొంగటి రమణారెడ్డి, సద్గుణల కుమార్తె పావనిరెడ్డి (23) రెండేళ్ల క్రితం అదే జిల్లాలోని బుజేబుజే గ్రామానికి చెందిన ఎస్కే అహ్మద్ బాషా అనే వ్యక్తిని ప్రేమించి, ఇంట్లోవాళ్లకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది. కొన్నాళ్లకు ఫేస్ బుక్ ఖాతాను తెరిచిన ఆమె చాలామంది ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టింది.
అలా.. కలికిరి టమోటా మార్కెట్ యార్డుకు సమీపంలో ఉన్న ఓ బైక్ షోరూం డీలర్ తో ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఛాటింగ్ లతోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పావని కూడా తనకు పెళ్లయిన విషయాన్ని చెప్పకుండా.. అతనితో ఫేస్ బుక్ ప్రేమాయణం కొనసాగించింది. దీంతో పావనికి సదరు డీలర్ భారీ ఎత్తున నగదు ఇవ్వడంతో పాటు స్కూటీ కూడా కొనిపెట్టినట్లు సమాచారం.
కాగా, కొద్దిరోజుల క్రితం ఈ విషయమంతా భర్తకు తెలియడంతో తన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది పావని. దీంతో తన వద్ద నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు ప్రియుడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం బ్యాంకు కోచింగ్ నిమిత్తం నంద్యాలకు వెళ్లిన పావని, గురువారం రాత్రి ప్రియుడిని కలిసి అతని నచ్చజెప్పేందుకు మదనపల్లెకు వచ్చింది.
అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియదు గానీ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు మెసేజ్ పెట్టి విషం తాగింది. గమనించిన స్థానికులు 108లో సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది పావని. అనంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె హ్యాంగ్ బ్యాగ్ లోని రూ.14,600 నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లు, బంగారు నగదును స్వాధీనం చేసుకుని పావని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు.