షాక్: యజమాని తిట్టాడని, 4కిలోల బంగారంతో ఉడాయించాడు
డప: తనను తిట్టాడనే కోపంతో ఓ వ్యక్తి అతని యజమాని పేరు చెప్పి ఏకంగా నాలుగు కిలోల బంగారం అపహరించి పరారయ్యాడు. ఇది గుర్తించిన యజమాని.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బంగారంతో అపహరించిన ఆ పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని మెయిన్బజారులో చంద్రశేఖర్రెడ్డి బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద గోవిందు సుదర్శనరెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతడు యజమానికి వరసకు బావమరిది అవుతాడు. పని సరిగా చేయడం లేదని తరచూ యజమాని తోటి పనివారి వద్ద దూషిస్తుండడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు సుదర్శన్రెడ్డి.
ఈ క్రమంలో చంద్రశేఖర్రెడ్డి నగలు ఇవ్వమన్నాడని చెప్పి పట్టణంలోని షేక్ దౌళా, షేక్ అనీఫ్, జి.సుబ్బారావు, జనార్ధనాచారి, మురళీధర్ అనే బంగారు వ్యాపారుల వద్ద లాంగ్చైన్స్, ఉంగరాలు, మాటీలు తదితర నాలుగు కిలోల నగలు తీసుకుని అక్టోబర్ 7వ తేదీ సుదర్శన్రెడ్డి ఉడాయించాడు.
అయితే నగలు ఎంతకూ వాపసు చేయకపోవడంతో వ్యాపారులు ఈ విషయాన్ని చంద్రశేఖర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సుదర్శన్రెడ్డి నగలతో పరారైనట్లు నిర్ధారణకు వచ్చిన వ్యాపారులు, చంద్రశేఖర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుదర్శన్రెడ్డి సెల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
రంగంలోకి దిగిన పోలీసులు సుదర్శన్రెడ్డి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసేందుకు సుదర్శన్రెడ్డి ప్రొద్దుటూరులోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవడంతో అక్కడే మాటువేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దఉన్న బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.