ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం ఎంత హంగామా చేశాడంటే .. చివరకు సీన్ లోకి ఎమ్మెల్యేనే రప్పించాడుగా !!
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ, అందుకు ఆమె తల్లిని ఒప్పించడానికి ఓ ప్రేమికుడి చేసిన ఘనకార్యం వింటే అందరు షాక్ కు గురౌతారు. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయాలని కోరుతూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లి ఒప్పుకుంటే సరి లేకుంటే సెల్ టవర్ మీద నుంచి దూకేస్తానని అంటూ నానా హంగామా చేశాడు.దీంతో అతగాడికి దించడానికి ఏకంగా ఎమ్మెల్యేనే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరం వళ్లియప్పనగర్కు చెందిన సంపత్కుమార్ ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. సంపత్ కుమార్, తవణంపల్లె మండలంలోని ఓ యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేసిన సంపత్ కుమార్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బాగా జన సమర్థం ఉండే చిత్తూరులోని ఓటి కే రోడ్ లో ఓ సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటూ హామీ ఇస్తేనే కిందికి దిగుతానని సంపత్కుమార్ సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నానా హంగామా సృష్టించాడు.
రంగంలోకి ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు... అమ్మాయి బంధువుల తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ
ఇక సెల్ టవర్ ఎక్కిన సంపత్ కుమార్ ను కిందికి దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందకు దిగాలని ఎన్నిసార్లు కోరినా అతను మాత్రం దూకేస్తానని అంటూ అక్కడే కూర్చున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేతప్ప టవర్ దిగనని.. ముందుగానే రాసిపెట్టుకున్న లేఖను కిందకు పడేశాడు. ఇక ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు సంపత్ కుమార్ ను ఒప్పించి కిందికి దించడానికి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత సంపత్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే అమ్మాయి బంధువుల తో మాట్లాడి న్యాయం చేస్తానని నచ్చజెప్పారు.
తల్లి దిగమన్నా దిగని సంపత్ కుమార్ ... పోలీసులు కేసు నమోదు
ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో సంపత్ కుమార్ టవర్ దిగాడు.సంపత్ కుమార్ చేసిన హంగామా నేపద్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వందలాది మంది జనం గుమికూడారు. మరోవైపు సంపత్ కుమార్ తల్లి అక్కడకు వచ్చి బతిమిలాడినా దిగలేదు. కొడుకు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో అని సంపత్ కుమార్ తల్లి కొంతసేపటికి ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. సుమారు రెండున్నర గంటల పాటు సంపత్ కుమార్ సెల్ టవర్ పైనే ఉండడంతో రద్దీగా ఉండే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చివరకు సంపత్ కుమార్ ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో కిందకి దిగగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.