‘కృష్ణా నదిలో నా మృతదేహం తీసుకోండి’: బెజవాడలో యువ టెక్కీ అదృశ్యం
మూడు రోజుల క్రితం అదృశ్యమైన నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాగసాయి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ: మూడు రోజుల క్రితం అదృశ్యమైన నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాగసాయి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాదంపాడుకు చెందిన నాగసాయి(25) హైదరాబాద్లోని సీజీఐ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. అతడు ఏప్రిల్ 6న విజయవాడకు వచ్చాడు. శనివారం రాత్రి బైక్పై బయటకు వెళ్లాడు.
కాగా, కొద్ది సేపటికే తన అన్న సంతోష్ కుమార్ వాట్సప్కు.. తాను ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకి చనిపోతున్నానని, తన శరీరాన్ని కృష్ణా నదిలోంచి తీసుకోవాలంటూ మెసేజ్ పంపాడు నాగసాయి. దీంతో నాగసాయి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
గత కొంతకాలంగా నాగసాయి పని ఒత్తిడికి గురవుతున్నాడని, అందుకే ప్రశాంతత కోసం తిరుపతి కూడా వెళ్లి వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు నాగసాయి ఫేస్బుక్ లైవ్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానా లేక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? క్షణికావేశంలో మోటారు సైకిల్ వదిలి ఎటైనా వెళ్లి పోయాడా? అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నాగసాయి బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు.