స్వీట్ ఎంగిలిచేయొద్దంటే తీవ్రంగా కొట్టిన కౌన్సిలర్: అవమానంతో యువకుడి ఆత్మహత్య
శ్రీకాకుళం: ఓ కౌన్సిలర్ దురాగతం కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరిముందు తీవ్రంగా కొట్టడంతో అవమానంగా భావించిన ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన డోకి హరీష్ (24)పై పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘ కౌన్సిలర్ పైల చక్రధర్ తన అనుచరులతో కలిసి చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన హరీష్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంగిలి చేయితో వద్దన్నందుకు..
ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు, హరీష్ తండ్రి వెంకటరమణ వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. హరీష్ డిగ్రీ చదివి కాశీబుగ్గలోని శ్రీలక్ష్మి స్వీట్ దుకాణంలో కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ చక్రధర్రావు దుకాణానికి వచ్చి మిఠాయి తీసుకొని తిన్నారు. మళ్లీ చేతితో మిఠాయిని తీసుకుంటుండగా ఎంగిలి చేయితో తీయవద్దని హరీష్ సూచించాడు. దీంతో కౌన్సిలర్ చక్రధర్రావు హరీష్ను కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
మళ్లీ వచ్చి.. వెంటబడి కొట్టారు
ఆ తర్వాత కొద్ది సేపటికి కొంతమందిని వెంటబెట్టుకొని మళ్లీ దుకాణానికొచ్చి లోపల ఉండే హరీష్ను బయటకు తీసుకొచ్చి వెంటబడి మరీ కొట్టారు. అందరూ చూస్తుండగా కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఎంత వేడుకున్నా కనికరం చూపలేదు. ఆ బాధ తట్టుకోలేని హరీష్ కుటుంబీకులకు ఫోన్ చేసి రాత్రికి ఇంటికి రావడం లేదని సినిమాకి వెళ్లి ఉదయం వస్తానని చెప్పాడు.
రైలు పట్టాలపై శవంగా..
సోమవారం ఉదయం ఇంటికి రాకపోవడంతో దుకాణం యజమాని దండాసికి హరీష్ తండ్రి వెంకటరమణ ఫోన్ చేయగా దుకాణానికి రాలేదని చెప్పారు. మధ్యాహ్నం వరకు కనిపించకపోవడంతో వెంకటరమణ కాశీబుగ్గలోని దుకాణానికి వచ్చారు. ఇంతలో పలాస-పూండి రైలు నిలయాల మధ్య గుర్తు తెలియని మృతదేహం ఉందని తెలుసుకున్న హరీష్ కుటుంబీకులు అనుమానంతో రైల్వే పోలీసులను సంప్రదించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ మృతదేహం హరీష్దిగా గుర్తించారు.
అవమానం భరించలేక
తమ కుమారుడిపై దాడి చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని హరీష్ తండ్రి వెంకటరమణ వాపోయాడు. కాగా, హరీష్ను కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికాడ్డయ్యాయి. ఆధారాలు బలంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ మృతి గురించి తెలుసుకొని వైశ్య సంఘ నాయకులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
కౌన్సిలర్పై చర్యలేవీ? నిరసనలు
ఆదివారం స్వీట్ దుకాణం వద్ద గొవడ జరిగిందని తెలుసుకొని యజమాని దండాశి, హరీష్తో పాటు కౌన్సిలర్ చక్రధర్రావును పిలిపించి విచారించామని సీఐ అశోక్కుమార్ పేర్కొన్నారు. విచారించిన తర్వాత ఎవరికి వారుగా వెళ్లిపోయారని చెప్పారు. జరిగిన సంఘటనపై మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కాగా, యువకుడి ఆత్మహత్యకు కారణమైన పైల చక్రధరరావుపై చర్యలు తీసుకోవాలంటూ పలాస- కాశీబుగ్గలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్పై దాడి చేసిన కౌన్సిలర్ పైలచక్రధర్పై ఆదివారం ఫిర్యాదు చేసినప్పుడే అతనిపై కేసు నమోదు చేసి ఉంటే.. హరీష్ చనిపోయి ఉండేవాడు కాదని అతని తండ్రి వెంకటరావు, చెల్లి పూజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చక్రధర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నోటీసులు జారీ చేసింది. ఇది ఇలావుంటే నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. హరీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.