మాస్క్ ఇష్యూ: చీరాల యువకుడి మృతి, పోలీసులు కొట్టారా? జీపులోంచి పడటంతోనేనా?
ప్రకాశం: ఇప్పటికే సీతానగరం పోలీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు తావివ్వగా.. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసు తీరు వివాదాస్పదంగా మారింది. మాస్కు పెట్టుకోలేదని కారణంగా చీరాల ఎస్ఐ విజయ్ కుమార్.. కిరణ్ అనే యువకుడిని లాఠీతో తీవ్రంగా కొట్టాడన, దీంతో అతడు మరణించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాస్కు పెట్టుకోలేదు.. మద్యం మత్తులో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిరణ్ కుమార్(26), అతని స్నేహితుడితో కలిసి గత శనివారం బైక్పై కొత్తపేట నుంచి చీరాలకు వెళ్తున్నాడు. స్థానిక కొత్తపేట పంచాయతీ కార్యాలయం సమీపంలోని చెక్ పోస్టు వద్దకు రాగానే మాస్కులు ధరించలేదని పోలీసులు వారిద్దరినీ అడ్డుకున్నారు. మాస్కులు పెట్టుకోలేదని ప్రశ్నించిన పోలీసులతో.. మద్యం మత్తులో ఉన్న యువకులు వాగ్వాదానికి దిగారు.
ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించడంతోనే..
సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ వెంటనే ఘటనా స్తలికి చేరుకున్నాడు. వారిద్దరూ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎస్ఐ యువకులిద్దరినీ జీపులో ఎక్కించుకుని స్టేషన్కు బయల్దేరారు. అయితే, మార్గమధ్యలోనే కిరణ్ కుమార్ జీపులోంచి దూకగా.. అతని తలకు బలమైన గాయమైందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.
పారదర్శకమైన దర్యాప్తు.. బాధితుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం..
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ.. ఘటనపై స్వతంత్రంగా పక్క జిల్లా అధికారులతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. యువకుడి మృతిపై ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Recommended Video
మాస్కు పెట్టుకోకుంటే కొట్టి చంపేస్తారా.?
ఇది ఇాలావుంటే, బాధితుడి కుటుంబసభ్యులు మాత్రం.. పోలీసులు కొట్టడం వల్లే కిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టడంతోనే కిరణ్ స్పృహ తప్పిపడిపోయాడని, దీంతో అతడ్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు వదిలాడని తెలిపారు. మాస్కు పెట్టుకోకుంటే కొట్టి చంపుతారా? అని బాధితుడు కిరణ్ తండ్రి మోహన్ రావు ప్రశ్నించారు. కిరణ్ మృతికి కారణమైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని బాధితుడి బంధువులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.