ఏంలేదు బ్రో! ఈ సొసైటీ నచ్చడం లేదు.. సారీ అంటూ యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యవకుడు జీవితం మీద విరక్తిపుట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ఈ సమాజం నచ్చడం లేదంటూ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఆ యువకుడు మరణం అతని కుటుంబసభ్యులను, స్నేహితులను విషాదంలో ముంచింది.
సొసైటీ నచ్చడం లేదంటూ..
కూకట్పల్లిలో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న మారిశెట్టి రాజు అనేయువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు తనకు ఈ సమాజం నచ్చడం లేదని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
స్నేహితులకు, తల్లిదండ్రులకు సారీ..
తనతోపాటు ఉంటున్న స్నేహితులకు ఇబ్బందులు కలగకూడదనే తాను ఈ వీడియో తీసినట్లు అందులో అతడు చెప్పాడు. తన స్నేహితులకు, తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు సారీ అంటూ వీడియోను ముగించాడు. ఆ తర్వాత ఆ వీడియోను స్నేహితులకు పంపాడు.
ఎవరూ లేని సమయంలో..
మారిశెట్టి రాజా(26)ది తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ. ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లిలోని దయార్గూడలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాగా, ఆదివారం రూంలో ఎవరూలేని సమయంలో రాజా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషాదంలో కుటుంబం
కాసేపటి తర్వాత రూంకి చేరుకున్న స్నేహితులు రాజాను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆ కారణంతోనేనా?
కాగా, ఈ ఘటనపై రాజా సోదరుడు మారిశెట్టి చంద్రశేఖర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను అక్టోబర్ 17నే ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానని.. అయితే, ఆదివారం రాజా స్నేహితులు ఫోన్ చేసి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు చంద్రశేఖర్. సొంత గ్రామంలో తమ కుటుంబానికి ఆస్తి తగాదాలున్నాయని, వాటితో విసిగిపోయే రాజా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.