అమ్మానాన్న క్షమించండి: అత్తింటి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య, భార్యకు వివాహేతర సంబంధం?
విజయవాడ: అత్తింటి వేధింపులు భరించలేక కృష్ణలంకలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్న అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆత్మహత్య చేసుకునే ముందు బాధితుడు గురవారెడ్డి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో తనను భార్యతోపాటు అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని వేడుకున్నాడు. తప్పుడు ఫిర్యాదు చేసి తనను పోలీసులతో అరెస్ట్ చేయించారని వాపోయాడు.
కృష్ణలంలో తనను అరెస్ట్ చేసిన పోలీసులు తనను రెండు రోజులపాటు నిర్బంధించి వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తన భార్య కోసం ఎంతో చేశానని, అది ఆమెకు కూడా తెలుసని చెప్పాడు. అయినా తనను వేధింపులకు గురిచేశారని వాపోయాడు. రాత్రి రాత్రే మాటలు మార్చేస్తున్నారని ఆరోపించాడు.
తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ.. గురవారెడ్డి తన తల్లిదండ్రులను క్షమించాలని కోరాడు. జిత్తూ అమ్మానాన్నలను బాగా చూసుకో అంటూ వీడియోలో తెలిపాడు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురవారెడ్డి భార్యకు యువకుడితో వివాహేతర సంబంధం?
కాగా, గురువారెడ్డి భార్య గాయత్రికి కార్తీక్ అనే యువకుడితో ప్రేమాయణం ఉన్నట్లు తెలిసింది. తరచూ కార్తీక్తో సెల్ఫోన్లో మాట్లాడటం, చాట్ చేయడంపై గురవారెడ్డి నిలదీయడంతోనే.. అతనికి భార్యతోపాటు అత్తింటివారు వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. అంతేగాక,తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులతో కొట్టించారని గురవారెడ్డి తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.