ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన త్రిమూర్తులు!
తూర్పుగోదావరి: ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన పని. అయితే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. అతడే తూర్పుగోదావరి జిల్లా లోని చేబ్రోలు గ్రామానికి చెందిన 27ఏళ్ల రాయుడు త్రిమూర్తులు.
కేవలం ఐదు నెలల కాలంలోనే త్రిమూర్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీ పరీక్షలు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను పట్టేశాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఏసుబాబు, తల్లి నాగలక్ష్మిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కుమారుడు ఎంతో కష్టడి శ్రద్ధతో చదివడం వల్లే ఈ ఉద్యోగులు వెతుక్కుంటూ వచ్చాయని వారంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సివిల్ ఎస్సై, ఏపీ సివిల్ కానిస్టేబుల్, దక్షిణమధ్య రైల్వే లోకో అసిస్టెంట్ పైలట్, రైల్వే గ్రూడ్-డీ ఉద్యోగాలను త్రిమూర్తులు దక్కించుకున్నాడు. 10వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న త్రిమూర్తులు.. ఇంటర్మీడియట్ పిఠాపురంలో, బీటెక్(మెకానికల్)ను చేబ్రోలులో పూర్తి చేశారు.
2013లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాయుడు.. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత 2017 నుంచి పోటీ పరీక్షలు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పోటీ పరీక్షలు రాసిన త్రిమూర్తులు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. తనకు చిన్న నాటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉందని.. అందుకే తాను ఎస్ఐగా చేరతానని త్రిమూర్తులు చెప్పారు.