బీటెక్ విద్యార్థికి షాక్: ఆన్లైన్లో ల్యాప్టాప్ కొంటే.. రాళ్లు, రోటీ ముక్కలు వచ్చాయి!
పశ్చిమ గోదావరి: ఆన్లైన్లో ల్యాప్టాప్ ఆర్డర్ చేసిన ఓ బీటెక్ విద్యార్థి.. తనకు వచ్చిన బాక్సును తెరిచి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అందులో ల్యాప్టాప్కు బదులు రాళ్లు(టైల్స్), రొట్టె ముక్క ఉండటమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని పోణంగి రోడ్డులో ఉంటున్న కొలుసు తారకరామ్ బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్ 12న అతను లెనోవా కంపెనీ ల్యాప్టాప్ను (మోడల్ నెంబరు 5080) పేటీఎంలో బుక్ చేశారు.
ఇందుకోసం రూ.31,940 ఆన్లైన్లో జమ చేశాడు. బుధవారం బ్లూడాట్ కొరియర్ ద్వారా అతనికి పార్శిల్ అందింది. దాన్ని తెరచి చూడగా ల్యాప్టాప్ పరిమాణంలో ఉన్న రెండు రాళ్లు (టైల్స్), కొన్ని చపాతీ ముక్కలు బయటపడ్డాయి.
ఒక్కసారిగా కంగుతిన్న బాధితుడు తారకరామ్.. కంపెనీ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయగా అటు నుంచి సమాధానం రాలేదు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంంలో ఫిర్యాదు చేస్తానని బాధితుడు తారకరామ్ చెప్పారు.