భయమే ఆ జంట ప్రాణం తీసింది: రోజంతా కృష్ణానది అందాలు చూసి..
వారిద్దరూ స్నేహితులు. ఇంట్లో ఏదో చెప్పి సరదాగా బయటికి వచ్చారు. కృష్ణా నది అందాలు చూస్తూ మైమరిచిపోయారు. రోజంతా తిరిగి రాత్రికి ఇంటింటికి చేరేందుకు బయల్దేరారు. చీకటి పడుతుండటంతో నదిలో ను
గద్వాల/కర్నూలు: వారిద్దరూ స్నేహితులు. ఇంట్లో ఏదో చెప్పి సరదాగా బయటికి వచ్చారు. కృష్ణా నది అందాలు చూస్తూ మైమరిచిపోయారు. రోజంతా తిరిగి రాత్రికి ఇంటింటికి చేరేందుకు బయల్దేరారు. చీకటి పడుతుండటంతో నదిలో నుంచి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు. అయితే, ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఆ యువతీయుకుడు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన రేకుపల్లిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాలకు అని చెప్పి..
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కటికవీధికి చెందిన మహ్మద్ రఫి, మునీరభాను కూమారుడు వారిస్(19) ఎర్రకోటలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై గద్వాలకు వచ్చాడు.
సనాను పిలిపించుకుని.. రోజంతా తిరిగారు..
కాగా, గద్వాలోని కుంటవీధికి చెందిన వారిస్ మామ జాఫర్బాయి కూతురు సనా జబీన్(17)కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం రేకులపల్లి వద్ద ఉన్న కృష్ణానది, లోయర్ జూరాల పరిసరా ప్రాంతాల్లో తిరిగారు. చీకటి పడుతుండటంతో ఇంటికి చేరుకోవాలని నది పరిసరాల నుంచి బయటకు వస్తున్నారు. అయితే నదిలో మధ్యాహ్నం నుంచే నీటి ఉధృతి క్రమంగా పెరిగింది. వీరిద్దరిని గమనించిన గ్రామస్తుడు భీంరెడ్డి అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తానని చెప్పి పడవ తెచ్చేందుకు వెళ్లాడు.
ఆ భయంతోనే..
అయితే, తమ గురించి ఇంట్లో తెలిస్తే ప్రమాదమని భయాందోళనకు గురైన వారు అతను రాకముందే నదీలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ.. నీటి ఉధృతికి ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ విషయం గమనించిన వెంటనే భీంరెడ్డి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహాయంతో నదిలో వెదికినా లాభం లేకపోయింది.
ఇద్దరి మృతదేహాలు లభ్యం
అనంతరం రూరల్ ఎస్ అంజద్అలీకి సమాచారం అందించగా ఆయన సిబ్బందితో వచ్చి.. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు చీకటి పడటంతో గజఈతగాళ్లు సైతం వెనుదిరిగారు. ఆదివారం ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా.. 10 గంటల సమయంలో వారిస్ మృతదేహం వలకు చిక్కింది. 12 గంటల సమయంలో సనా జబీన్ మృతదేహం లభ్యమైంది. వెలికితీసిన మృతదేహలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇరు కుటుంబాల్లో తీరని విషాదం
కళాశాలకు వెళ్తున్నానని యువకుడు, ఫ్రెండ్ ఇంటికి వెళ్లొస్తానని వెళ్లిన యువతి.. ఇద్దరూ తిరిగి రాని లోకాలకు చేరడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గల్లంతైన వారి మృతదేహలు లభ్యం కావడంతో అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.