ఎపి:సెక్రటేరియట్ లో అడుగుపెట్టాలంటే ఆధార్ ఉండాల్సిదే!
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ భద్రతను మరింత పెంచేందుకు ఎపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సచివాలయానికి వచ్చే సందర్శకులు తమ ఆధార్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా సందర్శకులు సెక్రటేరియట్ లోకి ప్రవేశించేందుకు విజిటింగ్ అవర్స్ ను సైతం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు ప్రభుత్వం పరిమితం చేసింది. ఆ సమయంలో గేటు వద్ద ఉండే జీఏడీ సిబ్బందే వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్ నంబర్ నమోదు చేసి పాసులు జారీ చేస్తుంటారు. మిగిలిన సమయాల్లో సచివాయాన్ని సందర్శించాలనుకునే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక సాంకేతికత వ్యవస్థను సిద్దం చేసింది.
అలాగే మాన్యువల్ పాసుల విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది. ఆధార్ నంబర్ తీసుకొని జీఏడీ జారీ చేసిన పాస్లను గేటు వద్ద చూపితే భద్రతా సిబ్బంది సచివాలయం లోపలకు అనుమతిస్తారు. సందర్శకులు ఇచ్చే ఆధార్ నెంబర్ ఆధారంగా వారి వివరాలు కంప్యూటర్ లో నమోదు చేసి అనంతరం పాస్ ఇవ్వడం జరుగుతుందని తెలుస్తోంది. అయితే సందర్శకులు బృందంగా వస్తే వారిలో ఒకరి ఆధార్ నంబర్ నమోదు చేసుకుంటారని తెలిసింది.
Recommended Video
అయితే రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంలోకి ప్రవేశాన్ని ఇంతగా కట్టుదిట్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు, అనేక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అలాగే సామాన్య ప్రజలు తమ పనుల నిమిత్తం సెక్రటేరియట్ కు వస్తుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వారినందరిని అసంతృప్తికి గురిచేసే అవకాశం కనిపిస్తోంది.
కారణం ఆధార్ నంబర్ మరచిపోవడం లేదా ఆధార్ నంబర్ దుర్వినియోగం పై సందేహాలు వంటి సమస్యలతో ఆధార్ వెల్లడికి నిరాకరించే అవకాశం లేకుండా పోతోంది. ముఖ్యంగా సామాన్యులు తమ పని నిమిత్తం సెక్రటేరియట్ కు సంకోచం లేకుండా వెళ్లే పరిస్థితి పోతుందని జనాలు చర్చించుకుంటున్నారు.