షాక్: మొదటి వివాహన్ని బయటపెట్టిన ఆధార్కార్డ్, భార్య నిలదీసిందని భర్త ఏం చేశాడంటే?
హిందూపురం: సంక్షేమ పథకాల్లో బోగస్ లబ్దిదారుల ఏరివేతకు ఆధార్కార్డులను ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. అయితే మొదట వివాహం జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని వివాహం చేసుకొన్న విషయాన్ని ఆధార్ కార్డు బయటపెట్టింది. ఈ విషయమై భార్య నిలదీయడంతో భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం నాడు చోటు చేసుకొంది.
ఆధార్ కారణంగా సంక్షేమ పథకాల్లో బోగస్ లబ్దిదారులను నివారించవచ్చు. నిజమైన లబ్దిదారులకే నేరుగా ప్రయోజనం చేకూరేలా ఆధార్ కార్డు పని చేస్తోంది. మరో వైపు గుర్తింపు కోసం కూడ ఈ కార్డు పనిచేస్తోంది.
అయితే అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో నివాసం ఉంటున్న తిరుపతినాయుడు మొదట వివాహం చేసుకొన్న విషయాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకొన్నాడు. అయితే ఆధార్ కార్డు ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.
ఆధార్తో బయటపడ్డ మొదటి పెళ్ళి
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన చింతలపూడి తిరుపతినాయుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన ఇతడు 15నెలలుగా రహమత్పురంలోని ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుండేవాడు. ఇతడికి ఈ ఏడాది జూన్ 16న ఉయ్యూరుకు చెందిన దుర్గాభవానితో వివాహమైంది. హిందూపురంలోని నింకంపల్లిలో నివాసముండేవారు. అయితే అతనికి మొదట పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి దుర్గాభవానితో రెండో వివాహం చేసుకొన్నాడు. అయితే ఆధార్ కార్డు ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.
మొదటి భార్య ఆధార్ కార్డుపై
విధుల నిమిత్తం ఆఫీసుకు వెళ్ళిన తిరుపతి నాయుడు చెక్బుక్ కోసం భార్యకు ఫోన్ చేశాడు. అయితే చెక్ బుక్ కోసం దుర్గాభవానీ వెతుకుతున్న సమయంలోనే తిరుపతినాయుడు మొదటి భార్య ప్రసన్న లక్ష్మి ఆధార్ కార్డు దొరికింది. ప్రసన్నలక్ష్మి ఆధార్ కార్డులో భర్త పేరు తిరుపతినాయుడుగా ఉంది.అయితే ఈ విషయమై భర్తను నిలదీసింది భార్య దుర్గాభవానీ. ఇంటికి వెళ్ళిన తిరుపతినాయుడుతో భార్య గొడవకు దిగింది. తన కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇస్తానని చెప్పింది. సాయంత్రం వచ్చాక మాట్లాడుతానని తిరుపతినాయుడు భార్యతో చెప్పి ఆపీసుకు వెళ్ళిపోయాడు.
పది నిమిషాల్లో వస్తానని చెప్పి
ప్రతి రోజూ రాత్రి 8.30 నిమిషాలకు భర్త తిరుపతినాయుడు ఇంటికి వచ్చేవాడు. అయితే బుదవారం రాత్రి భర్తకు ఫోన్ చేసిన దుర్గా భవానికి పది నిమిషాల్లో ఇంటికి వస్తానని భర్త తిరుపతినాయుడు చెప్పాడు. కానీ, తిరిగి రాలేదు. దీంతో ఆమె బంధువులకు సమాచారాన్ని ఇచ్చింది. అయితే తిరుపతినాయుడు తాను పనిచేసే కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
మొదటి భార్యకు తెలియకుండా వివాహం
2012 జనవరి 28న తిరుపతి నాయుడు ప్రసన్న లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ళ కొడుకు కూడ ఉన్నాడు. ప్రసన్నలక్ష్మి విజయవాడలో ఉంటున్నట్లు తె లుస్తోంది. మొదటి వివాహం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి వ్యవహారం వెలుగు చూస్తుందని తిరుపతి నాయుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుపై విజయవాడ పోలీసులతో కలిసి విచారణ చేపడుతున్నారు.