ఏపీలో బీజేపీకి మరో షాక్: ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానంటే... విష్ణుకుమార్ రాజు సంచలనం
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, ఏపీలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రలో పార్టీ పరిస్థితి బాగా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక్కడ బీజేపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, అందుకే తమ నాయకులు పార్టీని వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?
విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తానని విష్ణు
అలాగే, వచ్చే ఎన్నికల్లో తన పోటీ పైన కూడా విష్ణు కుమార్ రాజు స్పందించారు. విశాఖ నార్త్ నుంచి తాను పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికల కోడ్ వచ్చాక చెబుతానని కూడా అన్నారు. ఇటీవల బీజేపీకి రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ఈ నెల 21వ తేదీన ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆకుల స్వయంగా ప్రకటించారు.
బీజేపీ పరిస్థితిపై విష్ణు ఆవేదన
2014లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, కామినేని శ్రీనివాస రావు, మాణిక్యాల రావులు గెలిచారు. మాణిక్యాల రావు బీజేపీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. కామినేని మౌనంగా ఉన్నారు. ఆకుల జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు విష్ణు కూడా ఏపీలో పార్టీ పరిస్థితిపై ఆవేదనగా ఉన్నారు.
ఏ పార్టీ నుంచి పోటీ చేసేది తర్వాత చెబుతానని వ్యాఖ్య
తాను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక చెబుతానని ప్రకటించడం గమనార్హం. అంటే విష్ణు కూడా ఆకులలాగే పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నారు.