విమానాశ్రయాల భద్రతపై ఆరా: అత్యవసర సందేశాలు: అప్రమత్తమైన ఓఎన్జీసీ: రిగ్గులు ఖాళీ
అమరావతి/న్యూఢిల్లీ: మరో 24 గంటల్లో ఫొని తుఫాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో.. పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. విశాఖపట్నం సహా తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని విమానాశ్రయాలకు అత్యవసర సందేశాలను పంపించింది. స్థానిక జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని సూచించింది. ఫొని తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేలా జాగ్రత్తలను తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల పాటు అతి బారీ వర్షాలు..! ఏపిలో మొదలైన "ఫొనీ" ప్రభావం..!!
చెన్నై నుంచి కోల్ కత దాకా..
ఫొని తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్టుల అథారిటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. చెన్నై మొదలుకుని కోల్ కత వరకు ఉన్న అన్ని విమానాశ్రయాల డైరెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారిని అప్రమత్తం చేశారు. ప్రత్యేకించి- చెన్నై, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్ కత విమానాశ్రయాల అధికారులతో ఆయన మాట్లాడారు. ముందు జాగ్రత్త చర్యలపై ఆరా తీశారు.
ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించండి:
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. తుఫాన్ ముందస్తు చర్యలపై స్థానిక పాలనా యంత్రాంగాన్ని సమన్వయం పరచుకోవాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని అన్నారు. తుఫాన్ల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే కొన్ని నిబంధనలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్-ఎస్ఓపీ) ఉన్నాయని, వాటిని అనుసరించాలని సురేష్ ప్రభు అధికారులకు సూచించారు.
రిగ్గులను ఖాళీ చేసిన ఓఎన్జీసీ..
కాగా- ఫొని తుఫాన్ నేపథ్యంలో.. చమురు, సహజవాయువుల సంస్థ (ఓఎన్జీసీ) అప్రత్తమైంది. తుఫాన్ తీరం దాటడానికి 48 గంటల ముందే- రిగ్గులను ఖాళీ చేసింది. రిగ్గుల్లో విధి నిర్వహణలో ఉన్న 480 మంది సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించింది. సముద్రగర్భం నుంచి సహజవాయువులను వెలికి తీయడానికి ఓఎన్జీసీ సంస్థ బంగాళాఖాతంలో రిగ్గులను నిర్మించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, ఒడిశా తీరాల్లో సముద్రంలో నిర్మించిన నాలుగు రిగ్గుల నుంచి 480 మంది కార్మికులను ఓఎన్జీసీ అధికారులు ఒడ్డుకు తీసుకొచ్చారు. అబాన్-2 నుంచి 85 మంది, డీడీ-8 నుంచి 103, లూసియానా-83, ఎస్సార్ వైల్డ్ క్యాట్ రిగ్గు నుంచి 87 మంది కార్మికులను ఒడ్డుకు తీసుకొచ్చారు అధికారులు.
స్తంభించిన ఓడరేవులు
ఫొని తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం ఓడరేవులో రోజువారీ కార్యకలాపాలను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ ఓడరేవును నిద్రాణస్థితిలో ఉంచారు. అత్యవసరం మినహా సాధారణ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు. ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లంగర్ వేసిన నౌకలకు నష్టం వాటిల్లకుండా ఏర్పాట్లు చేశారు.
ఏ మాత్రం తగ్గని తీవ్రత..
‘ఫొని' రూపంలో మరో పెను తుపాను దూసుకువ స్తుండడం ఆ ప్రాంతం వారిని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇది బుధవారం రాత్రికి పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశాలోని గోపాల్పూర్- చాంద్బలీ మధ్య పూరీకి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం తీరాన్ని దాటనుంది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.