బలరాం ఎంట్రీ..ఆమంచి అలక: ముగ్గూరూ వైసీపీలోనే: ప్రకాశంలో కొత్త సమీక "రణం"....!
చీరాల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ...టీడీపీ నుండి మరో కీలక నేత వైసీపీ బాట పట్టనున్నారు. ప్రస్తుతం టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. ఆయన అధికా రికంగా వైసీపీలో చేరకపోయినా..ఇప్పటికే టీడీపీ నుండి వైసీపీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ..మద్దాలి గిరి తరహాలోనే వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే ప్రకాశం జిల్లా నుండి కనిగిరి టీడీపీ ఇన్ ఛార్జ్ కదిరి బాబూరావు వైసీపీలో చేరారు.
ఇక, ఇప్పుడు కరణం బలరాం..పోతుల సునీత వర్గాలతో టీడీపీలో ఉన్న సమయంలో అంతర్గతంగా..వైసీపీ చేరిన తరువాత బహిరంగంగా ఆమంచి వర్గం పోరాటం చేస్తోంది. మూడు రాజధానుల బిల్లుల సమయంలో పోతుల సునీత టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఇక, ఇప్పుడు కరణం బలరాం సైతం వైసీపీ బాట పడుతున్నారు. వీరిద్దరి రాకను ఆమంచి వర్గం ఆహ్వానించటానికి సిద్దంగా లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన ఆమంచి కినుక వహించినట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు చీరాల రాజకీయాల్లో కొత్త రణం మొదలైంది.
వైసీపీలోకి కరణం బలరాం ఎంట్రీ..
తొలి నుండి టీడీపీలో అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న కరణం బలరాం ఆ పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. బలరాం టీడీపీ నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా..ఒక సారి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో చీరాల నుండి టీడీపీ అభ్యర్ధిగా పోతుల సునీత పోటీ చేశారు. వైసీపీ నుండి యడం బాలాజీ..నవోదయం పార్టీ నుండి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో ఆమంచి టీడీపీ అభ్యర్థి పోతుల సునీత పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో..ఆమంచి టీడీపీలో చేరిపోయారు. అప్పట్లో ప్రత్యర్థుగా పోటీ చేసిన పోతుల సునీత, ఆమంచిలు ఇటీవల ఎన్నికల దాకా ఒకే పార్టీలో ఉన్నారు. గడచిన ఐదేళ్లల్లో ఒకే పార్టీలో ఉంటూ వీరిరువురి మధ్య ఆధిపత్య పోరు సాగింది. కాగా..2019 ఎన్నికల సమయంలో ఆమంచి వైసీపీలో చేరటంతో టీడీపీ అధినేత చంద్రబాబు చీరాల బాధ్యతలను సునీతను కాదని బలరాంకు అప్పగించి..అక్కడి నుండి సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో బలరాం గెలుపొందారు.
వైసీపీలోనే ఆమంచి..సునీత..ఇప్పుడు బలరాం
ఇక, 2019 ఎన్నికల్లో చీరాల నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆమంచి ఓడిపోయారు. ఆయన పైన టీడీపీ నుండి పోటీ చేసిన బలరాం గెలుపొందారు. ఇక, తాజాగా పోతుల సునీత వైసీపీలో చేరారు. ఇప్పుడు బలరాం సైతం వైసీపీ బాట పట్టారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి చీరాలలో ఆమంచి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. అక్కడ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక, సునీతను వైసీపీలో చేర్చుకోవటం ఆమంచికి ఇష్టం లేదు.
ఆమె కారణంగానే తాను టీడీపీలో ఉన్న సమయంలో ఇబ్బందులు పడ్డాననేది ఆమంచి భావన. ఇక, ఇప్పుడు తాను ఎన్నికల వేళ నుండి పోరాటం చేస్తున్న కరణం బలరాం ను సైతం వైసీపీలో తీసుకుంటున్నారనే సమాచారం పైన ఆమంచి కినుక వహించినట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పలు దఫాలుగా బలరాంతో చర్చలు జరిపి వైసీపీలో చేరేందుకు ఒప్పించారు.
Recommended Video
ముగ్గురూ ఒకే పార్టీలో..ఆమంచి ఏం చేస్తారు..
తాను తొలి నుండి ఎవరితో విభేదించారో..ఎవరి కారణంగా టీడీపీ వీడి వైసీపీలో చేరారో ఇప్పుడు వారే తిరిగి వైసీపీలో చేరటం ఆమంచికి ఇబ్బందిగా మారింది. ఆమంచి వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. బలరాం వైసీపీకి అనుబంధంగా ఉన్నా..ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. ఇది ఆమంచికి రుచించని విషయం.
అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమంచి చెప్పిన విధంగానే..పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసి..ఆయన మాటకే ప్రాధాన్యత ఇచ్చింది. వైసీపీలో చేరిన సమయం నుండి సామాజిక వర్గాల అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును ఇరుకున పెట్టటం తో పాటుగా తోట త్రిమూర్తులు లాంటి వారిని వైసీపీలోకి తీసుకురావటంలో ఆమంచి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టిన ఇద్దిరినీ వైసీపీలోకి తీసుకోవటం పైన ఆమంచి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఆమంచిని ఏ విధంగా బుజ్జిగిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.