కేవీపీ బిల్లుకు నిరాశే: అడ్డుపడ్డ ఆప్ ఎంపీ వీడియోలో ఏముంది?
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో చర్చ, ఓటింగ్కు వస్తుందని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన ఏపీ ప్రజలకు నిరాశే ఎదురైంది. కేవీపీ బిల్లుపై చర్చకు వస్తుందని బిల్లుని పాస్ చేయించుకునేందుకు ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసి మద్దతు కూడగట్టారు.
శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రైవేటు సభ్యుల బిల్లుల బిజినెస్ ప్రారంభం కావాల్సి ఉంది. మొదట 13 కొత్త ప్రైవేట్ బిల్లులను కొంతమంది సభ్యులు ప్రవేశపెట్టిన తరువాత 14వ అంశంగా కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎజెండాలో చేర్చారు.
ఏఏపీ ఎంపీ వీడియో రగడ, కేవీపీ బిల్లుపై సస్పెన్స్: అదే దారిలో జగన్
మధ్యాహ్నం 2.30 సమయం కోసం యావత్ ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వాయిదా పడిన రాజ్యసభ, తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ప్రైవేట్ బిల్లుల చర్చకు రానున్న సమయంలో పార్లమెంట్లో ఆప్ ఎంపీ భగవత్ మాన్ తీసిన వీడియో కేవీపీ ప్రైవేట్ బిల్లుపై ప్రభావం చూపింది.
అంతేకాదు రాజ్యసభ సోమవారానికి వాయిదా పడేలా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ తీసిన వీడియో శుక్రవారం అటు లోక్సభ, ఇటు రాజ్యసభను కుదిపేసింది. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే పార్లమెంట్లో వీడియో తీసిన ఏఏపీ సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి చెందిన ఎంపీలు కొందరు ఆయన వ్యవహారం తేల్చాలని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు. శుక్రవారం పార్లమెంట్ను అంతలా కుదిపేసిన అప్ ఎంపీ భగవత్ మాన్ తీసిన వీడియోలో ఏముందంటే..
పార్లమెంటును
కుదిపేసిన
భగవత్
'వీడియో'
వివాదం..
పంజాబ్కు చెందిన ఎంపీ భగవంత్ తన ఇంటి నుంచి బయలుదేరి పార్లమెంట్ లోపలికి వెళ్లే వరకు తన ఫోన్తో వీడియో తీసారు. కారులో కూర్చున్న ఎంపీ తన ఫోన్ను స్విచ్ ఆన్ చేసి పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లను వీడియో తీశాడు. పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలను సైతం వీడియో తీసారు.
ఇలా తన ఇంటి నుంచి పార్లమెంట్ వరకు సెక్యూరిటీ ఎలా ఉందో చెబుతూ తాను తీసిన వీడియోకు కామెంట్రీ కూడా ఇచ్చారు. అంతేకాకదు ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్లో లైవ్గా ప్రసారం అయ్యేలా చూశారు. ఈ క్రమంలో పార్లమెంట్లోకి వస్తున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ ఆయన్ను ఫోటోలు తీయరాదంటూ అడ్డుపడ్డాడు.
అయితే తాను తీస్తున్న వీడియోను రహస్యంగా ఉంచనున్నట్లు సెక్యుూరిటీకి తెలిపాడు. దీంతో పాటు తాను చేసిన పనికి లోక్సభ స్పీకర్ తప్పుగా భావిస్తే, క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమని వెల్లడించారు. ఇలా ఆప్ ఎంపీ భగవత్ మాన్ వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడాన్ని సభ్యులు తప్పుబట్టారు.
లోక్సభలో ఎంపీ భగవత్ మాన్పై చర్యలు తీసుకోవాలని పట్టుబడ్డారు. దీంతో వీడియో చిత్రీకరణపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు తీసుకున్నారు. వీడియోపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి స్పీకర్ సమన్లు జారీ చేశారు. ఆప్ ఎంపీ వ్యవహారంపై లోక్సభ ఈనెల 25 వరకు వాయిదా పడగా.. రాజ్యసభలో గందరగోళం నెలకొంది.
అయితే డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ్యుల డిమాండ్ ను పక్కకు పెట్టారు. మాన్ లోకసభ సభ్యుడు కావడం వల్ల రాజ్యసభలో చర్చ కుదరదన్నారు. పార్లమెంట్లో సెక్యూరిటీ కీలక అంశమని, కట్టుదిట్టమైన సెక్యూర్టీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం ఆ ఎంపీపై ఎటువంటి చర్యనైనా తీసుకోవచ్చని కురియన్ అన్నారు.