ఆరా ఎగ్జిట్ పోల్స్ .. వైసీపీ దే హవా .. వైసీపీ 120-125 ,టీడీపీ 50-55, జనసేన 0
ఆరా సంస్థ 2009 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తోంది. ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇకపోతే ఉత్కంఠ రేపిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 85కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలిపింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలుస్తుందని ఆరా స్పష్టం చేసింది. అలాగే టీఆర్ఎస్ భారీ విజయాన్ని అందుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను కచ్చితంగా ప్రకటించిన ఆరా సంస్థ ఈసారి ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేకు పూర్తి భిన్నంగా ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆరా తన సర్వేలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120స్థానాల్లో గెలవబోతుందని స్పష్టం చేసింది ఆరా ఎగ్జిట్ పోల్స్ . ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 50 స్థానాల్లోనే విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఫలితాల విషయానికి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా వైసీపీలో ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా ఈసారి ఓడిపోతుందని సర్వేలో తేల్చి చెప్పింది. రోజా ఓటమికి వైసీపీలోని కీలక నేతలే కారణమని కూడా స్పష్టం చేసింది. జనసేన ఒక్క స్థానంలో కూడా గెలవదని ఆరా సంస్థ స్పష్టం చేసింది.
2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు చూస్తే టీడీపీ 50 నుండి 55 స్థానాల వరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 నుండి 125 స్థానాల వరకు , ఇక జనసేన ఒక్క స్థానం కూడా గెలవదని ఎగ్జిట్ పోల్స్ లో తేల్చి చెప్పింది ఆరా. ఇక లోక్ సభలో సైతం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలను , టీడీపీ 5 స్థానాలను మాత్రమే దక్కించుకుంటుందని ప్రకటించింది. జనసేన పార్టీ అటు లోక్ సభలో కానీ, ఇటు శాసన సభలో కానీ బోణీ కొట్టదని తేల్చేసింది. చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ మేరకు ఎగ్జాట్ పోల్స్ కు సరిపోతాయో.