సత్యసాయి కంటే ముందే వచ్చి నేలపై అబ్దుల్ కలాం, కుర్చీ వేయించిన బాబా
అనంతపురం: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టపర్తిని సందర్శించారు. భారతీయ ఆధ్యాత్మిక గురువుగా ఖండాంతర ఖ్యాతి గాంచిన సత్యసాయి బాబా అంటే కలాంకు అభిమానం. అందువల్ల కలాంకు వీలు చిక్కినప్పుడు సత్యాసాయి బాబాను చూడటానికి పుట్టపర్తి వెళ్లేవారు.
తాను రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు సాయిబాబా 81వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. శాస్త్రవేత్త, పైగా రాష్ట్రపతి హోదాలో ఉన్న అబ్దుల్ కలాం.. సాయిబాబాను కలుసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి.
అయితే, ఆ వేడుకల సందర్భంగా రెండు రోజులపాటు పుట్టపర్తిలోనే ఉన్న అబ్దుల్ కలాం పట్ల సాయిబాబా అత్యంత ఆదరాభిమానాలు కురిపించారు. తనతో సమానంగా ఆసనం వేయించి గౌరవించారు. అయితే, ఒక ఉదయం పుట్టపర్తిలోని సభామందిర ప్రాంగణం సాయికుల్వంత్ హాలుకు సత్యసాయిబాబా చేరుకోవడానికి ముందే కలాం వచ్చారు.
కలాం కుర్చీలో కాకుండా నేల పైన కూర్చున్నారు. అక్కడున్న విద్యార్థుల్లో విద్యార్థిగా కలసిపోయారు. దీనిని గుర్తించిన సాయి సేవకులు, ఇతర భద్రతా సిబ్బంది కుర్చీలో కూర్చోవాలని కోరారు. వద్దని చెప్పారు. దిండ్లు ఇచ్చినా వద్దన్నారు.
అక్కడకు వచ్చిన సత్యసాయి బాబా... కలాం నేల పైన కూర్చోవడం చూసి తన వద్దకు పిలిపించుకొని, తన పక్కనే ఆసనం వేయించి కూర్చోబెట్టుకున్నారు. అబ్దుల్ కలాం కేరళలోని ఇస్రోలో పని చేసిన సమయంలో సాయంత్రం ఐదున్నర దాటితే అధికారిక వాహనం వాడే వారు కాదట.