చంపాలనేదే కోరికైతే ఇంటికే వచ్చి ప్రాణాలిస్తా: మధు; నివురు గప్పిన నిప్పులా నంద్యాల
నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని అభిరుచి మధు అన్నారు. తనను చంపాలనేదే వారి కోరికైతే వారి ఇంటికెళ్లి మరీ ప్రాణాలు అర్పించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఘటన సమయంలో ఆత్మరక్షణ క
నంద్యాల: బైపోల్ ముగిసిన తర్వాత టీడీపీ-వైసీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటుండం నంద్యాలలో హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నికల దాకా ప్రశాంతంగా కొనసాగిన వాతావరణం.. ఒక్కసారిగా అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తుండటంతో.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
నంద్యాలలో కలకలం: టిడిపి నేత గన్మెన్ కాల్పులు, శిల్పాపై హత్యాయత్నమని..
గురువారం సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద జరిగిన నాటకీయ పరిణామాలు నంద్యాల పాలిటిక్స్ ను హీటెక్కించాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు హత్యాయత్నం ఆరోపణలు చేసుకోవడంతో.. ఎవరి వాదనలో నిజమెంతన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
పూజారులపై కూడా రౌడీషీట్:
టీడీపీకి చెందిన అభిరుచి మధు కత్తితో హల్చల్ చేస్తూ తమపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. మధు ఓ రౌడీ షీటర్ అని ఆరోపించారు. దీనిపై అభిరుచి మధు సైతం ఘాటుగా ప్రతిస్పందించారు.
నంద్యాలలో ప్రతీ ఒక్కరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించడం శిల్పా సోదరులకు అలవాటని, చివరకు గుళ్లోని పూజారులపై కూడా రౌడీ షీట్ తెరిపించేంత ఘనత వారిదని మధు ఎద్దేవా చేశారు. తనపై రౌడీ షీట్ క్లోజ్ చేయమని కోర్టు ఎప్పుడో చెప్పిందని తెలిపారు.
చంపాలనేదే కోరికైతే:
నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని, తనను చంపాలనేదే వారి కోరికైతే వారి ఇంటికెళ్లి మరీ ప్రాణాలు అర్పించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఘటన సమయంలో ఆత్మరక్షణ కోసమే నా గన్ మెన్ కాల్పులు జరిపారని మధు తెలిపారు.
మాజీ కౌన్సిలర్ భర్త భాషా ఇటీవలే మృతి చెందారని, ఆయనకు నివాళి అర్పించేందుకు తాను వచ్చానని మధు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న చక్రపాణిరెడ్డి.. ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దాడి చేయడానికి 100మంది రౌడీలతో వచ్చి రాళ్లతో, వెపన్లతో దాడి చేశారని పేర్కొన్నారు. తన కారు అద్దాలు పగులగొట్టారని,హత్యాయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు.
నివురు గప్పిన నిప్పులా:
నిజానికి సూరజ్ గ్రాండ్ వద్ద అభిరుచి మధు వాహనం నిలిపి ఉండటమే మొత్తం ఘర్షణకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. వాహనం అడ్డు తొలగించేందుకు మధు అంగీకరించకపోవడంతోనే వైసీపీ నేతలకు ఆయనకు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.
తొలుత వైసీపీ నేతలు రాళ్ల దాడి చేయగా.. ఆపై మధు గన్ మెన్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఆ వెంటనే ఓ కొబ్బరి బోండాల వ్యాపారి నుంచి కత్తి లాక్కున్న మధు రోడ్డుపై హల్చల్ చేశారు.
నివురు గప్పిన నిప్పులా నంద్యాలలో ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు పోలీస్ యంత్రాంగం మాత్రం అంతటా ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని చెబుతున్నారు. మధు ఫిర్యాదు మేరకు శిల్పా చక్రపాణిరెడ్డి సహా ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
భూమా బ్రహ్మానందరెడ్డి స్పందన:
ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారని టీడీపీ నేత భూమా బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం నంద్యాలలో వాతావరణం ప్రశాంతంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.
వైసీపీ కౌన్సిలర్ భర్త భాషా చనిపోతే అభిరుచి మధు చూడటానికి వెళ్లాడని, అదే సమయంలో చక్రపాణిరెడ్డి ఎదురుపడటంతో.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఇక్కడిదాకా దారి తీసిందని తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి, ఆదిరెడ్డి ఘటనలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఘటన జరిగిన ప్రదేశం ప్రధాన కూడలి కావడంతో పోలీసులు చాలా తొందరగా స్పందించారని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాలు రాకముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే రిజల్ట్స్ వచ్చే నాటికి పరిస్థితులు మరింత అదుపు తప్పుతాయేమోనన్న ఆందోళన ప్రస్తుతం నంద్యాలలో నెలకొంది. పోలీసులు సైతం ప్రత్యేక నిఘాతో నంద్యాలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.