అప్పట్లో సైకిల్ మీద తిరిగినాయన.. ఇప్పుడో మీడియా అధినేత : ఏబీకే
హైదరాబాద్ : అమరావతి భూముల్లో అక్రమాలపై కోర్టు మెట్లెక్కిన ఏబీకే ప్రసాద్ కు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. నువ్వంటే.. నువ్వు ఉన్మాది అంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. మాటల యుద్దం ఎలా ఉన్నా.. చంద్రబాబు పోకడలపై, రాజధాని విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఏబీకే ప్రసాద్.
ఈ నేపథ్యంలోనే.. ఏబీకే ప్రసాద్ జగన్ మనిషిలా వ్యవహరిస్తున్నారంటూ అధికార పక్షం ఆయన్ను టార్గెట్ చేసింది. దీంతో ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నా ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేయించాల్సిన అవసరం జగన్ కు ఏముందని ప్రశ్నించారు. అలాగే ఏబీకే ప్రసాద్ సాక్షి ఉద్యోగి అంటూ ఓ ప్రుముఖ మీడియా సంస్థ ప్రచారం చేయడం పట్ల స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సైకిల్ మీద వచ్చిపోయిన వ్యక్తి.. ఇప్పుడు మీడియా అధిపతి :
తనను సాక్షి ఉద్యోగి అంటూ ఓ ప్రముఖ మీడియా చేస్తోన్న ప్రచారానికి చురకలంటించారు ఏబీకే ప్రసాద్. ఒకప్పుడు.. తన కిందే పనిచేసి సైకిల్ మీద వచ్చిపోయిన వ్యక్తి నేడు ఓ మీడియా సంస్థకు అధిపతి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, సదరు మీడియా అధిపతి లేని డబ్బును సంపాదించుకున్నారని, తాను మాత్రం ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానని చెప్పారు ఏబీకే.
ప్రస్తుతం పత్రికల్లో రాసే వ్యాసాలకు వచ్చే గౌరవ వేతనం తప్ప తనకెలాంటి ప్రత్యేక ఆదాయ వనరులు లేవని తెలిపిన ఆయన.. జర్నలిస్టు కాలనీలో ఉన్న తన ఇంటిని కూడా అమ్ముకున్నట్లు తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్న చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలోనే 15ఏళ్లుగా తాను ఆశ్రయం పొందుతున్నానని తెలియజేశారు.