తెహల్కాను బ్రతిమాలుకుని బాబు బయటపడ్డారు : ఏబీకే సంచలన వ్యాఖ్యలు
విజయవాడ : అమరావతి భూముల్లో అధికార పక్షం అవినీతి అవకతవకలకు పాల్పడిందంటూ.. సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై గుస్సా అయిన ఏపీ సీఎం చంద్రబాబు ఏబీకే ప్రసాద్ పై పలు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలను తిప్పికొడుతూ చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏబీకే ప్రసాద్.
తనను ఉన్మాది అంటూ ప్రస్తావించిన చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తనను ఉన్మాది అన్నవారే ఉన్మాదులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీకే ప్రసాద్. తొలిసారి సీఎం పదవి చేపట్టిన సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్ని సంస్కరణలను తాను వ్యతిరేకించానని, చివరికి ఆ సంస్కరణల ఫలితంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విఫయమేనని అన్నారు.
ఇక చంద్రబాబు ఆస్తుల గురించి ప్రస్తావించిన ఏబీకే ప్రసాద్.. 'కేవలం రెండున్నర ఎకరాలున్న ఆసామి, సీఎం అయిన మొదటి దఫాలోనే ఏకంగా రూ.3వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని అప్పట్లో తెహల్కా పత్రిక బయటపెడితే.. విషయం తెలుసుకున్న చంద్రబాబు తెహల్కా పత్రిక కాళ్లా వేళ్లా పడి బ్రతిమాలుకుని అందులో తన వివరణ వేయించుకోగలిగారని' తెలిపారు ఏబీకే.
ఇక ప్రస్తుతం తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని జగన్ తో ముడిపెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. వేరే వాళ్ల తరుపున కోర్టుల్లో కేసులు వేయించాల్సిన అవసరం జగన్ కు ఏముందని ఏబీకే ప్రశ్నించారురాజధానికి తాను వ్యతిరేకం కాదన్న ఏబీకే ప్రసాద్, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను నీరు గార్చే ప్రయత్నం చేస్తుండడం పైనే తన అభ్యంతరం అన్నారు.
రాజధాని ఎంపిక కోసం కార్పోరేట్ వ్యక్తులతో కమిటీని నియమించడం పట్ల అభ్యంతరం తెలిపిన ఏబీకే, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటునే ప్రభుత్వం మళ్లీ చేస్తోందన్నారు ప్రసాద్. రాజధాని భూసేకరణ పట్ల అభ్యంతరం తెలుపుతూ రైతులు కూడా హైకోర్టుకు వెళ్లారని గుర్తు చేసిన ఆయన.. కేవలం పిటిషన్ వేసేందుకు పెద్ద ఖర్చేమి ఉందన్నారు. తాను పిటిషన్ వేసేందుకు అయిన రూ.10వేల ఖర్చును సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ భరించారని వివరించారు.