టీలోని పది జిల్లాల్లో.. చానళ్ల బ్యాన్: హైకోర్టుకు ఏబీఎన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో చానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. దసరా తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను ఎమ్మెస్వోలు మూడు నెలల క్రితం ఆపివేసిన విషయం తెలిసిందే. చానళ్ల ప్రసారాల నిలిపివేత అమానుషమని, తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వమే నిలిపివేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అది తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.