నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల..
తెలుగు రాష్ట్రాలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. భగభగమండే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పొడి వాతావరణం, వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణికార్తెకు ముందే రోళ్లు బద్దలు కొడుతున్న ఎండలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి.
ఎండల ఎఫెక్ట్ చూశారా.. ? బాబోయ్.. ఆమ్లెట్, దోశలే కాదు.. బజ్జీలు కూడా..! (వీడియో)
5 నుంచి 7డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ కుతకుత ఉడికిపోతోంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం మలమలా మాడిపోతున్నారు. ఉదయం ఆరింటి నుంచి సూర్యుడి ప్రతాపం మొదలవుతుండగా.. రాత్రి ఎనిమిదింటి వరకు కూడా వడ గాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 5 నుంచి 7డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నెల్లూరు జిల్లాల్లో ఏకంగా 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరిలో ఉష్ణోగ్రత దాదాపు 46డిగ్రీలకు చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
కొనసాగనున్న వడగాలులు
ఏపీలో వడగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొమ్మిది జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూల్, కడప, చిత్తూరు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు అత్యవసం అయితే తప్ప ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల లోపు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు
తెలంగాణ సైతం నిప్పుల కుంపటిలా మారింది. ఎండ, వడగాల్పులు, ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదుకానంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో ఉష్ణోగ్రత 46.3డిగ్రీలకు చేరగా.. ముదిగొండ, పెనుబల్లిలో 46.2, గుబ్బగూడెం, వైరా, పల్లెగూడెంలో 46.1, మహబూబాబాద్లో 46, భద్రాద్రి కొత్తగూడెంలో 45.9, సూర్యాపేటలో 45.8, హైదరాబాద్లో 41.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. 2016లో 45 డిగ్రీలు దాటి పదేళ్ల అత్యధిక స్థాయికి చేరిన ఎండలు ఈసారి మరో డిగ్రీ పెరిగి ఆ రికార్డును బ్రేక్ చేశాయి.