దెబ్బకు దెబ్బ తీయాల్సిందే: సెలెక్ట్ కమిటీ బిల్లుల భవిష్యతేంటి: మండలి రద్దు...టీడీపీలో కొత్త టెన్షన్.
Recommended Video
ఏపీలో అధికార పార్టీకి శాసన మండలిలో ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయంగా టీడీపీ ఆ సభలో పైచేయి సాధించింది. ప్రభుత్వం పైన ప్రతిపక్షం తాత్కాలికంగా అయినా విజయం సాధించింది. దీంతో..ఈ దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని అధికార వైసీపీ పట్టుదలతో ఉంది. అధికారంలో తాము ఉంటే..తమ మాట చెల్లుబాటు కాకుండా పోవటం ఏంటని ఆగ్రహిస్తోంది. తప్పు అని చెబుతూనే..మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం ఏంటని నిలదీస్తోంది. దీంతో..ఏకంగా మండలి రద్దు ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. అయితే, మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందితే..సెలెక్ట్ కమటీ బిల్లుల భవితవ్యం ఏంటి. పూర్తిగా మండలి రద్దు అయి..రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసే దాకా అమల్లో ఉంటుందా..రూల్స్ ఏం చెబుతున్నాయి..ప్రభుత్వ అడుగుల వెనుక వ్యూహం ఏంటి..
మండలి రద్దుపై ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు: తొలిసారిగా నోరు విప్పిన నేత: మంత్రులపైనా..!
మండలి రద్దయితే బిల్లులు ఏమవుతాయి..
ఇప్పుడు మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. అయితే, ఆ ప్రక్రియ సాంకేతికంగా పూర్తి కాలేదు. ఇదే సమయంలో మండలి రద్దు ప్రతిపాదనల పైన ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచనలు చేస్తోంది. ఈ నెల 27న తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా అయితే, శాసనసభ ఆమోదం పొంది..మండలి ఆమోదం పొందాల్సిన బిల్లులు ఉంటే.. అవన్నీ గవర్నర్ వద్దకు వెల్లి ఆయన ఆమోదంతో చట్ట రూపం దాలుస్తాయి. అయితే, ఇక్కడ ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. మండలిలో చర్చ జరిగింది. ప్రభుత్వం సమాధానం సైతం ఇచ్చింది. ఛైర్మన్ హోదాలో ఈ బిల్లులను ఏం చేయాలనే దాని పైన ఛైర్మన్ తన విచక్షణాధికారం మేరకు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తే..ఈ సెలెక్ట్ బిల్లుల భవితవ్యం ఏంటనే చర్చ మొదలైంది.
మండలి రద్దే సాధ్యం కాదంటూ..
మండలి రద్దు ఆలోచనలు..సెలెక్ట్ కమిటీకి బిల్లుల పైన న్యాయ పరంగానూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లులు ఏవి పెండింగ్ లో ఉన్నా..మండలి రద్దు ప్రతిపాదన అసెంబ్లీలో చేయటం వరకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, మండలి రద్దు నిర్ణయం అధికారికంగా ఆమోదించే సమయంలో మాత్రం కొన్ని అంశాల పైన కేంద్రం వివరణ కోరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని పైన న్యాయ నిపుణులతో చంద్రబాబు సమావేశ సమయంలో వారు కీలక అంశాలను చెప్పుకొచ్చారు. కీలకమైన బిల్లులపై శాసనమండలి పనిచేస్తూ.. వాటిని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించిన దశలో మండలిని రద్దు చేయడం కుదరదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మరో అంశాన్ని వారు ప్రస్తావించారు. ప్రస్తుతం రాజధాని రైతులు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుల పైనా హైకోర్టుకు వెళ్లారు. అక్కడ చర్చల సమయంలో ప్రభుత్వం అధికారికంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో..మండలి రద్దు పైన ఏ విధంగా ముందుకెళ్లినా సెలెక్ట్ కమిటీ బిల్లులపైన ప్రభావం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తుది ఆమోదం పొందితే మాత్రం కష్టమే..
అసెంబ్లీలో ప్రభుత్వం మండలి రద్దు తీర్మానం ఆమోదించినా..రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చేవరకూ మండలి పనిచేస్తూనే ఉంటుందని.. రాజధాని బిల్లులపై సెలెక్ట్ కమిటీ కూడా ఏర్పాటై పని చేస్తూనే ఉంటుందని.. ఇవేవీ ఆగవని టీడీపీ నేత యనమల స్పష్టం చేశారు. అయినా రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేంద్రానికి ఏపీ ప్రభుత్వ తీర్మానం పంపినా..తుది ఆమోదానికి ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, సెలెక్ట్ కమిటీని అధికారికంగా సభ్యులతో ఏర్పాటు చేసి..వారికి బిల్లు బాధ్యతలు అప్పగించి..వారు అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇచ్చే సమయానికి తుది నిర్ణయం వస్తే మాత్రం ఆ బిల్లులకు శాసనసభ నిర్ణయం మేరకే ఆమోదం లభించినట్లుగా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటుగా ఈ మూడు రోజుల్లో అధికార పార్టీ వేగంగా..వ్యూహాత్మకంగా మండలి విషయంలో పావులు కదుపుతోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం టీడీపీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.