జగన్ కు బిగ్ షాక్... మండలి రద్దు ఇప్పట్లో లేనట్లే ... కరోనా ఎఫెక్ట్ తో పార్లమెంటు సమావేశాలు వాయిదా !
దేశవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభావం పార్లమెంటు సమావేశాలపైనా పడబోతోంది. ఇప్పటికే పార్లమెంటులో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం.. ఇవాళ్టితో సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసేందుకు సిద్దమవుతోంది. అదే జరిగితే శాసనమండలి రద్దు కోసం ఏఫీ ప్రభుత్వం పంపిన తీర్మానం బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. అప్పుడు ఏపీ రాజధాని తరలింపు కోసం మండలి రద్దును కీలకంగా భావిస్తున్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తప్పదు.
పార్లమెంటుపై కరోనా ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్ పైనా తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ ప్రభావంతో కేంద్రం ఇప్పటికే జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ సహా పలు చర్యలను ప్రకటించింది. అదే సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అర్ధాంతరంగా వాయిదా వేయలేని పరిస్ధితి. దీంతో ఇప్పటివరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సమావేశాలను కొనసాగించిన ప్రభుత్వం.. ఇక వాయిదా వేయక తప్పని పరిస్దితులు వచ్చేసినట్లు భావిస్తోంది.
నిరవధిక వాయిదాపై ఇవాళ ప్రకటన ?
ఎంపీలు, మంత్రులు, ప్రధాని, ఇతర వీఐపీల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు సమావేశాలు కొనసాగించలేని పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే పార్లమెంటు సచివాలయ అధికారులు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో ఇవాళ నిరవధిక వాయిదాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలకు కరోనా సోకినట్లు, మరెంతో మంది స్వీయ క్వారంటైన్ లో ఉన్నట్లు నిర్దారణ కావడంతో భద్రత దృష్టా పార్లమెంటు నిరవధిక వాయిదా వేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలిపాకే పార్లమెంటు వాయిదా వేయాల్సి ఉంటుంది. దీంతో ఈ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.
పార్లమెంటు వాయిదా- జగన్ కు షాక్..
ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్న వైసీపీ సర్కారుకు మండలిలో మాత్రం సెలక్ట్ కమిటీల రూపంలో భంగపాటు తప్పలేదు. అయితే నిర్ణీత సమయం పూర్తయింది కాబట్టి బిల్లులు మండలిలోనూ ఆమోదం పొందినట్లేనని ఓ దశలో వాదించిన వైసీపీ పెద్దలు.. ఆ తర్వాత మండలి రద్దు కోరుతూ పార్లమెంటుకు తీర్మానం చేసి పంపారు. ఇప్పుడు ఆ తీర్మానం ప్రకారం మండలి రద్దుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ అంతలోనే కరోనా ప్రభావంతో సమావేశాలు వాయిదా పడాల్సిన పరిస్దితి తలెత్తడం వైసీపీకి భారీ షాక్ గా మారబోతోంది.
మండలి రద్దు ఆమోదం పొందకపోతే...
పార్లమెంటు సమావేశాలు వాయిదా పడి మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టడం కుదరకపోతే తిరిగి వర్షాకాల సమావేశాల వరకూ వేచి చూడక తప్పదు. ఆ లోగా రాజధాని తరలింపుకు అందుబాటులో ఉన్న గడువు ముగిసిపోతుంది. దీంతో ఏకంగా రాజధాని తరలింపునే మరో ఏడాది వాయిదా వేసుకోక తప్పని పరిస్ధితి తలెత్తుతుంది. అదే జరిగితే ఇప్పటికే రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు నుంచి ఎదురవుతున్న న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది.
జగన్ ముందు ప్రత్యామ్నాయాలేంటి ?
పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిపోయి మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్ధితి వస్తే వచ్చే కేంద్రంతో లాబీయింగ్ చేసి మండలి రద్దు కోసం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. అలా కుదరపోతే ఏపీ ప్రభుత్వమే రాజధాని తరలింపు కోసం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చు. అదీ కుదరకపోతే వచ్చే ఏడాదికి తరలింపును వాయిదా వేసుకోక తప్పని పరిస్ధితులు తలెత్తవచ్చని తెలుస్తోంది.