డేంజర్ కింగ్ కోబ్రా : 14 అడుగుల పొడవు.. విశాఖలో పట్టివేత..
ఎండాకాలంలో పాములు పంట పొలాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తంగుడుబిల్లి గ్రామ పొలాల్లో సుమారు 14 అడుగులకు పైగా పొడవున్న గిరి నాగు పాము కనిపించింది. స్థానిక రైతులు ఆ భారీ పామును చూసి షాక్ తిన్నారు. అటవీ అధికారి ఎం.రమేష్కుమార్కి సమాచారం ఇవ్వడంతో.. ఆయన విశాఖలోని తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సమితి ప్రతినిధి మూర్తికి సమాచారమిచ్చారు.
పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్
హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకున్న మూర్తి.. రెండు గంటల పాటు శ్రమించి చాకచక్యంగా దాన్ని పట్టుకోగలిగారు. అనంతరం దాన్ని వాలాబు సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు చెప్పారు. పాము అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి వచ్చి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అరుదైన గిరి నాగుపాము పొలాల్లోకి వచ్చిందని తెలియడంతో.. చాలామంది గ్రామస్తులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు.
సాధారణంగా గిరి నాగు పాములు చాలా పొడవుగా ఉంటాయి. అటవీ ప్రాంతాల్లో,కొండ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఇవి చాలా ప్రమాదకరమైన పాములు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కొండ్రుకోటలోనూ గిరి నాగు పాము జనవాసాల్లోకి వచ్చి కలకలం రేపింది.