వేలెత్తి..: పీతల సుజాత సవాల్, నోరు అదుపులో: రోజా
హైదరాబాద్: శాసన సభలో మంత్రి పీతల సుజాత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజాలు సోమవారం సాయంత్రం ఘాటుగా విమర్శించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత గోరంట్ల క్షమాపణ చెప్పాలని రోజా, వైసీపీ డిమాండ్ చేసింది.
దీనిపై పీతల సుజాత మాట్లాడారు. రోజా మంత్రుల వైపు వేలెత్తి చూపిస్తూ దూషిస్తున్నారని పీతల సుజాత మండిపడ్డారు. అవగానరాహిత్యం ఉన్న ప్రతిపక్ష నేత ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు సభ అలా నడుస్తుందని ఎద్దేవా చేశారు. మగవారితో సమానంగా మహిళలను పైకి తీసుకు రావాలని చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
మహిళా నేత బూతులు తిడుతూ బెదిరిస్తున్నారన్నారు. రోజా తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఆమె తీరు ఎవరు సమర్థించినా తాను రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతానని సవాల్ చేశారు. మొదట ప్రతిపక్ష నేతలు సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నారు. కష్ట సమయంలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేశారన్నారు.
అదుపులో పెట్టుకోండి: రోజా
మంత్రిగారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని రోజా అన్నారు. ప్రతి దానికి జగన్ను అంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చినంత మాత్రాన గొప్పవాళ్లు కారన్నారు. ఈ సందర్భంగా రోజా చంద్రబాబును భస్మాసురుడితో పోల్చారు. ఓ సమయంలో ప్రతిపక్ష నేత జగన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మధ్య వాగ్వాదం జరిగింది.
మహిళ అయిన రోజాకు గోరంట్ల క్షమాపణ చెబితే తప్పేమిటని జగన్ ప్రశ్నించారు. దానికి యనమల మాట్లాడుతూ.. రికార్డులు చూశాక ఎవరిది తప్పైతే వారు క్షమాపణ చెబుతారన్నారు. క్షమాపణ చెప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై యనమల మాట్లాడుతూ.. రికార్డులు చూడకుండా క్షమాపణ ఎలా చెబుతారన్నారు.
వీడియో పరిశీలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రికార్డు చూసి ఎవరిది తప్పైతే వారు క్షమాపణ చెబుతారన్నారు. సభకు సీఆర్డీఏ బిల్లు రాకుండా డ్రామాలు ఆడుతున్నారని యనమల ఆరోపించారు.
దీనిపై జగన్ మాట్లాడుతూ.. తాము కౌరవ సభను చూస్తున్నామని, మీ బుర్రలు చెడిపోయాయని, మీ తప్పుడు మాటలను దేవుడు చూస్తున్నాడన్నారు. క్షమాపణ చెప్పకుంటే గోరంట్లను దేవుడు క్షమించడన్నారు. తాము క్షమాపణ చెప్పమంటే సీఆర్డీఏ బిల్లు అడ్డుకునేందుకని తమ పైన అపవాదు వేస్తున్నారని, అందుకే తాము క్షమాపణ చెప్పకున్నా ఊరుకుంటున్నామన్నారు.