కేటీఆర్కు సొంత నియోజకవర్గంలో చేదు, ఏబీవీపీపై టీఆర్ఎస్వీ దాడి!
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సిరిసిల్లలో చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్లకు వచ్చిన వారిని అఖిల భారత విద్యార్థి ఫరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు అడ్డుకున్నారు వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఏబీవీపీ విద్యార్థుల పైన టీఆర్ఎస్వీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
రాజ్ భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం
హైదరాబాదులోని రాజ్ భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం యత్నించారు. బోధనా రుసుములు చెల్లింపు, వైస్ ఛాన్సులర్ల నియామకం పైన వారు ఆందోళన నిర్వహించారు. రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థులు యత్నించడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ లెక్చరర్ల సంఘం డైరీ ఆవిష్కరణ
సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం 2015 డైరీ, క్యాలెండర్ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ ఒకే విధ్యావిధానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అందరికీ సమాన విద్యా అందించాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. ఇంటర్లో అమలు చేసిన విధానమే ఎంసెట్లో ఉంటుందన్నారు.
తలసానిపై టీడీపీ ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అంశం పైన తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. తలసాని రాజీనామాను వెంటనే ఆమోదించాలని, లేకుంటే తలసానిని మంత్రివర్గం నుండి తొలగించాలని కోరారు.