అవినీతి తిమింగలం, కళ్లు చెదిరే ఆస్తులు: అధికారులకే చుక్కలు, ఏసీబీ పైకి కుక్కలు వదిలాడు
సస్పెన్షన్లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వర రావు ఆస్తులపై ఏసీబీ శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
అమరావతి: సస్పెన్షన్లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వర రావు ఆస్తులపై ఏసీబీ శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆయనతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై 17 ప్రాంతాల్లో సోదాలు చేసింది.
విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాదులోను సోదాలు చేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ప్రకటన చేశారు. విశాఖ భూకుంభకోణంలో లక్ష్మీ గణేశ్వర రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిని విధుల నుంచి తప్పించారు.
బంధువు పేరిట ఐదంతస్తుల భవనం
విశాఖపట్నంలోని సీతంపేటలో గణేశ్వర రావు తన బంధువు పేరిట అయిదు అంతస్తుల అపార్టుమెంటును నిర్మిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.70 లక్షల విలువైన వోల్వో కారు, హోండా 120, ఇన్నోవా కార్లు గుర్తించారు. ఈ దాడుల్లో 3.2 కిలోల వెండి సామాగ్రి, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద ఎత్తున స్థిరాస్తి పత్రాలు బయటపడ్డాయని తెలుస్తోంది.
విదేశీ కరెన్సీ, వందల కోట్ల ఆస్తులు
విదేశీ కరెన్సీతో పాటు రూ.25 వేల విలువ గల రద్దయిన నోట్లు, రూ.10 లక్షల విలువైన ఇంటి సామాగ్రి, రూ.10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంట్లో రూ.34 వేల నగదును అధికారులు గుర్తించారు. రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు బహిరంగ మార్కెట్ విలువ ఉంటుందని భావిస్తున్నారు.
గణేశ్వర రావు
గణేశ్వర రావు లని ఆస్తులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.కోట్లలో రుణం పొందేవాడని అధికారులు గుర్తించారు. విశాఖలో సింహాచలం దేవస్థానంకు చెందిన ఆరెకరాల భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి రూ.34 కోట్ల రుణం పొందాడు. స్నేహితుల పేరిట ఆస్తులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వాటి నుంచి కూడా కోట్లు రుణం పొందాడని తెలుస్తోంది.
విశాఖ భూకంభకోణంలో కీలక నిందితుడు
విశాఖపట్నం భూ కుంభకోణంలోనూ కీలక నిందితుడైన లక్ష్మీగణేశ్వరరావుపై సిట్ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో అరెస్టై రిమాండులో ఉన్న ఆయన వారం రోజుల కిందటే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటినుంచి అతని కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అతను అక్రమాస్తులను కలిగి ఉన్నారంటూ తాజాగా కేసు నమోదు చేశారు. ఇతను నాలుగుసార్లు సస్పెండైనా తీరు మార్చుకోలేదు.
పెంట్ హౌస్ పైన దాక్కొని
ఏసీబీ డీఎస్పీ రమాదేవి బృందం విశాఖపట్నం శ్రీనగర్ ప్రాంతంలోని సువర్ణ రెసిడెన్సీలో లక్ష్మీ గణేశ్వరరావుకు చెందిన ఫ్లాటు వద్దకు చేరుకుని తలుపు తట్టారు. గణేశ్వరరావు ఇంట్లో లేరని, హైదరాబాద్ వెళ్లారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అనుమానంతో ఏసీబీ బృందం పెంట్హౌస్ వద్దకు చేరుకుంది. తాళం వేసి ఉండటంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పెంట్ హౌస్ లోపల ఉన్నట్లు గుర్తించి, బయటకు రావాలని చెప్పారు.
గంట గడిచినా రాలేదు, పోలీసులకు సమాచారం
గంటకు పైగా సమయం గడిచినా అతను బయటకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి పెంట్ హౌస్ తాళాలు పగుల కొట్టించారు. దీంతో అతను బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే గణేశ్వర రావు.. మీరు నాపై దాడి చేస్తున్నారని ప్రయివేటు కేసు నమోదు చేస్తానని ఏసీబీ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశాడు.
అధికారులపైకి కుక్కలను ఉసిగొల్పాడు
అదే సమయంలో అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అక్కడున్న ఏసీబీ బృందంపై ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలను ఉసిగొల్పాడు. ఆ కుక్క వారి మీదకు పరుగు లంఘించుకుంది. దీంతో కొందరు అక్కడి నుంచి పరుగు తీశారు. స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అతనిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.