ఏపీలో ఏసీబీ రైడ్స్ .. మున్సిపల్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసులే టార్గెట్ గా సోదాలు
ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు .
సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు , టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై ఫిర్యాదులు
ఇక నేడు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు , టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై జరుగుతున్న ఏసీబీ దాడులు వణుకు పుట్టిస్తున్నాయి.ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. ఇక అంతే కాకుండా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల పట్ల కూడా అధికారుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఏసీబీ ఏకకాలంలో జరిపిన మెరుపు దాడితో అధికారులకు చెమటలు
నిబంధనలకు విరుద్దంగా ప్లాన్లు మంజూరు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే విశాఖ, విజయవాడ, ఒంగోలు , విజయనగరం, నెల్లూరు , అనంతపురం , తూర్పు గోదావరి , గుంటూరు , కడప జిల్లాలలోని మున్సిపల్ కార్యాలయాలపై ఏకకాలంలో జరిపిన మెరుపు దాడితో అధికారులకు చెమటలు పడుతున్నాయి. విశాఖలోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు అందడంతో..రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
విశాఖ, విజయవాడలలో టౌన్ ప్లానింగ్ విభాగంలో కొనసాగుతున్న సోదాలు
విశాఖ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో జోన్ 1, జోన్ 5 కార్యాలయాల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను నేతృత్వంలో అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విజయవాడలో సైతం ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో పలు కీలక రికార్డులును పరిశీలిస్తున్నారు అధికారులు .
ఒంగోలులో ప్రైవేట్ వ్యక్తి పని చెయ్యటం గుర్తించిన ఏసీబీ .. కొనసాగుతున్న తనిఖీ
ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు . టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు, అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఫిర్యాదులపై తనిఖీ చేస్తున్నారు . ఇప్పటివరకు జరిపిన సోదాల్లోఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ ప్లాన్ పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి ఐదువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video
రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ తో మున్సిపల్ అధికారులలో టెన్షన్
ఇక విజయనగరం, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాలపై, టాన్ ఫ్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి రికార్డులు తనిఖీ చేస్తున్నారు.ఇటీవల తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి అధికారులను వణికించిన ఏసీబీ నేడు మున్సిపల్ కార్యాలయాల ఉద్యోగులను, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులను టెన్షన్ పెడుతున్నారు. ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ పారదర్శక పాలన అందించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆయన ఏసీబీ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ సోదాలు జరుగుతున్నాయి.