టీచింగ్ హాస్పటల్స్ పై ఏసీబీ దాడులు .. టెన్షన్ లో అవినీతి అధికారులు
ఏపీలో అవినీతి అధికారుల భరతం పట్టటానికి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆస్పత్రుల్లో మందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టారు. ఇష్టారాజ్యంగా మందుల కొనుగోళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపధ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చెయ్యటంతో అవినీతి అధికారులకు చెమటలు పడుతున్నాయి.ఈ సెగ ఇప్పుడు బోధనాసుపత్రులకు తగులుతోంది.
హడలెత్తిస్తున్న ఏసీబీ రైడ్స్ ... రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో సోదాలు..రీజన్ ఇదే !!
బోధనా ఆస్పత్రులలోనూ అవినీతిపై నజర్ పెట్టిన ఏసీబీ అధికారులు
ఇక వైద్య సేవలు అందించే ఆస్పత్రులు మాత్రమే కాకుండా బోధనా ఆస్పత్రులలోనూ జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు భారీగా ఫిర్యాదులందాయి. ఇక దీంతో బోధనాసుపత్రుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలతో పాటు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక టీడీపీ హయాంలోఆస్పత్రుల పర్యవేక్షణ సరిగా చెయ్యలేదని , ఇటీవల ఈఎస్ఐ ఆస్పత్రిలో మందుల స్కామ్ జరిగినట్టు గుర్తించిన అధికారులు ఇప్పుడు ఆస్పత్రులు, బోధనా ఆస్పత్రులపై కూడా దృష్టి సారించారు .
బోధనాసుపత్రులపై ఫిర్యాదుల వెల్లువ
ఇక బోధనాసుపత్రుల్లో ప్రధానంగా అవినీతి అధికారులు వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రధానంగా పారిశుధ్య కాంట్రాక్టర్లకు పనితీరు ఆధారంగా పాయింట్స్ ఇవ్వాలి. వాటితోనే వారికి రావాల్సిన బిల్లులు వస్తాయి. ఈ మార్కులు వేసేందుకు వారి నుంచి నెలకు ఒక్కో సూపరింటెండెంట్ రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం . నెల్లూరు బోధనాసుపత్రిలో నెలకు రూ.7 లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు అందాయి.
ప్రతీనెలా బోధనాసుపత్రుల సిబ్బంది కమీషన్ల దందా
రోగులకు ఆహారం పెట్టే డైట్ కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ కావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి . లోకల్ గా అవసరమైన మందుల కొనుగోలు చేయటంపై, ఆయా సరఫరా దారులతో సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు ప్రతినెలా కమీషన్ల దందా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో అవినీతి వైద్యులు, అధికారుల ఆట కట్టిస్తే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని భావిస్తున్న నేపధ్యంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో దాడులు చేసి అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు.
నెల్లూరు, విజయవాడ నుంచే ఎక్కువ ఫిర్యాదులు.. టెన్షన్ లో అక్రమార్కులు
ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రుల్లో నెల్లూరు, విజయవాడ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ సర్కార్ ఆరోగ్య శాఖను ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు ఎవరి బండారం బయట పడుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు ఏపీలో వైద్య శాఖాధికారులు .