అక్రమాస్తుల ఆనకొండ! ఏకకాలంలో 9 చోట్ల ఏసీబీ దాడులు, కళ్లుచెదిరే ఆస్తులు
విశాఖపట్టణంలోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి.
అమరావతి: విశాఖపట్టణంలోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు నివాసంలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి.
సోమవారం ఉదయం నుంచి విశాఖలోని ఆయన నివాసం 'శ్రీ గోవిందం భవనం'తో పాటు, తిరుపతిలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉండొచ్చని అంచనా.
విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల కమర్షియల్ స్థలం ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. వెంకయ్యనాయుడు నివాసంలో రెండు కార్లు, బైక్ ను సీజ్ చేశారు. 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరో రూ.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,రూ. 5 లక్షల పత్రాల ఉన్నట్టు గుర్తించారు. విశాఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఆయన పేరిట లాకర్ ఉన్నట్టు, వెంకయ్యనాయుడికి తన తండ్రి గురవయ్యనాయుడు పేరిట తిరుపతిలో ఐదు అంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరిట తుంగ్లాంలో ఓ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
విశాఖలో 6 చోట్ల, తిరుపతిలో 3 చోట్ల అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో 2011 జనవరిలో కూడా ఏసీబీ అధికారుల సోదాల్లో వెంకయ్యనాయుడు అరెస్టయ్యాడు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తుల కేసులో ఆయన్ని అరెస్టు చేసింది.