ACB RAIDS: అవినీతి అధికారులు వివరాలు ఇవ్వండి, జీఏడీకి ఏసీబీ జీఏడీ లేఖ
ఆంధ్రప్రదేశ్లో అవినీతి అధికారుల పట్ల అవినీతి నిరోధక శాఖ సింహస్వప్నంగా మారింది. గత కొద్దిరోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ.. గుండెల్లో రైలు పరుగెత్తిసోన్న సంగతి తెలిసిందే. తహశీల్దార్ కార్యాలయాల నుంచి మొదలైన దాడుల పర్వం, మున్సిపల్ ఆఫీసు, టౌన్ ప్లానింగ్ కార్యాలయం వరకు చేరింది. నిన్న ప్రభుత్వ ఆస్పత్రులపై దాడుల చేయడంతో ఎవరినీ వదిలిపెట్టబోమని ఏసీబీ అధికారులు సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం ఏసీబీ డీజీ.. జీఏడీకి రాసిన లేఖతో.. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు.
వదల బొమ్మాళీ..
గ్రామస్థాయి కార్యదర్శి నుంచి సచివాలయంలో పనిచేసే ఉన్నత ఉద్యోగి వరకు అవినీతి అధికారుల వివరాలను అందజేయాలని జీఏడీకి ఏసీబీ డీజీ లేఖ రాశారు. అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు అందజేయాలని అందులో కోరారు. దీంతో జీఏడీ నుంచి అన్నిశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, విభాగ అధిపతులకు కూడా లేఖలు పంపించినట్టు తెలుస్తోంది. అవినీతిని ఏ స్థాయిలో కూడా ఉపేక్షించబోమని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేయడంతో ఏసీబీ అధికారులు దాడులు వరసగా కొనసాగుతోన్నాయి.
వివరాలు కూడా..
ఇప్పటివరకు దాడుల్లో అరెస్టైన వారు, సస్పెండ్ అయిన వారి వివరాలు ఇవ్వాలని లేఖలో ఏసీబీ డీజీ కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి జూన్ 1 నుంచి ఏసీబీ దాడిచేసిన అధికారుల డేటాను సేకరించే పనిలో జీఏడీ నిమగ్నమైంది. ఏ కారణంతో రైడ్ చేశారు..? వారు ఎందుకు శిక్ష నుంచి తప్పించుకొంటున్నారనే అంశంపై ఏసీబీ ఆరాతీస్తోంది. మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరగడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రులపై కూడా ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఏపీలో కూడా ఈఎస్ఐ స్కాం వెలుగులోకి రావడంతో. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందా అని తనిఖీ చేపట్టింది.
భారీగా నగదు..
పదిరోజుల క్రితం 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 14 బృందాలు ఏకకాలంలో దాడులు చేశారు. గుంటూరు మున్సిపాలిటీలో రూ.లక్ష నగదు పట్టుబడినట్టు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో కూడా రైడ్స్ చేశారు. 2 లక్షల 87 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కచూపలేదని అధికారులు వివరించారు. ఇందులో అధికంగా గుంటూరులో లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు.