లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ విద్యాధికారి...అక్రమాస్తులు రూ.82 కోట్లు పైనే!
కాకినాడ:కాకినాడలో ఒక హెడ్ మాస్టర్ నుంచి లంచం తీసుకొంటూ పట్టుబడిన విద్యాధికారి ప్రభాకర్ రావు ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించిన ఎసిబి ఆ క్రమంలో ఈ విద్యాధికారి అక్రమార్జన గురించి తెలిసి విస్తుపోయింది.
తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ ఏడీగా పనిచేస్తున్న ప్రభాకర్ రావుకు సంబంధించి ఎసిబి అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.82 కోట్లకు పైగానే అక్రమాస్తులు గుర్తించారట. పైగా ఈయన గారి ఆస్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంపై ఎసిబి అధికారులే ఆశ్చర్యపోయారట. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
విద్యాశాఖ ఏడీ గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు కు అక్రమాస్తులపై విచారణ జరుపుతున్న ఎసిబి ఆయన తన అవినీతి సామ్రాజ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించిన వైనం వారిని విస్మయపరిచింది. ఏకధాటిగా జరిపిన సోదాల్లో ఇప్పటివరకూ రూ.82 కోట్ల విలువైన ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. మొన్నటిదాకా తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ ఏడీ గా పనిచేసిన ఈయన గత నెల 20 వ తేదీన రూ.10వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈయన రిమాండ్లోనే ఉన్నారు.
అయితే ఆ తరువాత ప్రభాకరరావుపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆయన ఆస్తులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ క్రమంలో మంగళవారం ఆయనకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఒక బృందం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆయన నివాసం, మరో బృందం తణుకు లోని ఆయన కుమారుడి ఇంట్లో సోదాలు నిర్వహించింది.మరో రెండు టీమ్ లు రాజమహేంద్రవరం, కర్నూలులో తనిఖీలు చేపట్టాయి.
ఇంకో టీమ్ బెంగళూరు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ప్రభాకరరావు కుటంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో రూ.2,99,07,084 విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అలాగే, రూ.80 కోట్ల విలువైన స్థలాలు, అపార్ట్మెంట్లు, షాపులు ప్రభాకరరావు, ఆయన భార్య పేరిట ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని, ఆయనపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ షకీలాభాను తెలిపారు.
ప్రభాకర్ రావుకు సంబంధించిన కొన్ని అక్రమాస్తుల వివరాలు ఇవి. విజయనగరంలో 1000 గజాల స్థలం, భగవన్ రెసిడెన్సీలో ఫ్లాటు; బాలాజీ టవర్స్లో 6.91 చదరపు గజాల్లో షాపు; కర్నూలు జిల్లా చట్నీహల్లిలో 2,066 గజాలు, ఓర్వకల్లో 171 గజాలు; బెంగళూరులోని విట్టసంద్రగ్రామంలో 1,287 గజాలు, బేగర్హు గ్లీ గ్రామంలో 2,400 గజాలు; తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెంపట్టిలో 1,200 గజాలు, రూ.11,46,620 విలువైన అరకిలో బంగారం, రూ.1,15,355 విలువైన 4 కిలోల వెండి ఇప్పటివరకూ లభించాయి.