వైసీపీకి షాక్: క్రికెట్ బుకీలతో సంబంధాలు, ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఏసీబీ కేసు
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఐసీపీ కేసు నమోదయింది. క్రికెట్ బూకీలతో కోటంరెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ... ఏపీ డీజీపీ మాలకొండయ్యకు నివేదిక సమర్పించారు.
వైసీపీ గ్రాఫ్ పెరిగింది, టీడీపీ ఓటమి ఖాయం: విష్ణు సంచలనం, జగన్ ఆగ్రహం
తదుపరి విచారణకు ఏసీబీకి అప్పగించారు. ఈ కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేయాలని ఏసీబీ డీజీ ఠాకూర్కు మాలకొండయ్య లేఖ రాశారు. దీంతో ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డిపై కేసు నమోదు చేసారు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న బుకీ గ్యాంగులకు కోటంరెడ్డి అండగా నిలిచారని ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమయ్యారని, వీటికి సంబంధించి విజయవాడలో హోటళ్లలో బిల్లులు, సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు.
అలాగే ప్రధాన బుకీ కృష్ణసింగ్కు కోటంరెడ్డి ఆశ్రయం కల్పించినట్లు విచారణలో వెల్లడైందని చెబుతున్నారు. కోటంరెడ్డికి కృష్ణసింగ్.. విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా రూ.23 లక్షలు అందించారని, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో డబ్బు అందించినట్లు పోలీసులు నిర్ధారించారు.
కృష్ణసింగ్ పేరు బయటకు వచ్చిన తరువాత ఆయన కొన్నాళ్లు పరారీలో ఉండగా, ఆ సమయంలో దాక్కోవడానికి చోటు కల్పించింది కోటంరెడ్డేనని, ఆపై కృష్ణసింగ్ కోర్టులో తనంతట తానుగా లొంగిపోయేందుకు కూడా కోటంరెడ్డి సహకరించారని, ఇందుకుగాను విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రూ.23 లక్షలను కోటంరెడ్డికి కృష్ణసింగ్ అందించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.