డిఎస్పీ అక్రమ ఆస్తుల కేసులో...వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకి ఏసీబీ నోటీసులు
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎసిబి తన నోటీసులో పేర్కొంది.
గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్కు నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉందని తెలిసింది. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది జరిపిన దాడుల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల డిఎస్పీ దేవిశెట్టి దుర్గా ప్రసాద్ సర్వీసు లో చేరిన పాతికేళ్లలోనే కోట్లాది రూపా యల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు గుర్తించారు. దుర్గా ప్రసాద్ 1991లో పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరారు.
2007లో సిఐగా పదోన్నతి పొందిన దుర్గాప్రసాద్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గుంటూరులోని పట్టాభిపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేసిన సమయంలో సివిల్ వివాదంలో జోక్యం చేసుకోగా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత 2014లో డిఎస్పీగా పదోన్నతి పొంది ఒంగోలు శిక్షణ కళాశాల డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
విధుల నిర్వహణలో పలు అవకతవకలకు పాల్పడి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడగట్టినట్లు వచ్చిన సమాచారంపై ఎసిబి అధికారులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
అక్రమంగా ఆర్జించిన ఆస్తుల్లో ఎక్కువ భాగం బినామీల పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆధారాలు రాబట్టారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించే ఆ బినామీల్లో ఒకరిగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అనుమానిస్తూ ఎసిబి ఆయనకు నోటీసులు జారీ చేసింది.