దీపావళి కానుక అంటూ రూ. లక్షల విలువైన నెక్లెస్: అవినీతి చేప దొరికిందిలా!
హైదరాబాద్: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి డబ్బులతోపాటు బంగారు నెక్లెస్ డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయింది. తాజాగా, తాను కోరుకున్న నెక్లెస్ కొనుగోలు చేసేందుకు బ్లడ్ బ్యాంక్ యజమాని లక్ష్మీరెడ్డితోపాటు ఆమె నగల దుకాణానికి వెళ్లినప్పుడు తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
బోయినపల్లిలోని జాహ్నవి వాలంటరీ బ్లడ్బ్యాంక్కు లింగంపల్లి లక్ష్మిరెడ్డి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇంఛార్జీ డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి ఇటీవల బ్లడ్బ్యాంక్ను సందర్శించారు.
తనిఖీ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు అధికారి లక్ష్మి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న రూ. 50వేల నగదు లక్ష్మిరెడ్డి నుంచి తీసుకున్నారు. అంతేగాక, తన కుమార్తెకు దీపావళి కానుకగా నెక్లెస్ ఇవ్వాలని పట్టుబట్టారు.
ఇక ఆ నెక్లెస్ విలువ రూ. 1.1లక్షలు ఉండటంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి నెక్లెస్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. నెక్లెస్ కొనుగోలు వీడియో బయటకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కాగా, లక్ష్మీరెడ్డి తరపు వ్యక్తులే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
పథకం ప్రకారమే డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని లక్ష్మీరెడ్డి.. లక్ష్మికి తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నగల దుకాణానికి వెళ్లారు. అంతకుముందే ఏసీబీకి సమాచారం ఇచ్చారు లక్ష్మీరెడ్డి. అబిడ్స్లోని ఓ బంగారు దుకాణంలో రూ. 1.10లక్షల విలువ చేసే బంగారు నెక్లెస్ను ఎంపిక చేసుకుంది లక్ష్మి.
అయితే, లక్ష్మీరెడ్డి తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, ఇదే బంగారు గొలుసును మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత ఆ గొలుసును డబ్బులు చెల్లించి, షాపు నుంచి బిల్లు తీసుకుంది. శుక్రవారం రాత్రి ఆ గొలుసును అధికారి లక్ష్మికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.