ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్...భారీగా లంచం తీసుకుంటూ దొరికిపోయాడు...
విజయవాడ: ఎసిబి వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు భారీగా లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
ఈడ్పుగల్లు కమిషనరేట్లో రూ.22.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏడుకొండలు ఏసీబీకి చిక్కారు. ఈ కేసును ఏసీబీ డీజీ ఠాకూర్ స్వయంగా పర్యవేక్షించారు. ఏడుకొండలును ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుకొండలు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. జిఎస్టి నేపథ్యంలో ఏడుకొండలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండల నుంచి డబ్బు కోసం వేధింపులు తట్టుకోలేక,భారీ మొత్తంలో అతడు డిమాండ్ చేస్తున్న లంచాలు ఇచ్చుకోలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది.
ఇతడు ఇప్పటికే జిఎస్టీ ని అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో అక్రమ సొమ్ము ఆర్జించినట్లు పలువురు వ్యాపారులు ఎసిబి అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా కొందరు వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ డీజీ ఠాకూర్ స్వయంగా ప్రణాళిక రచించి ఈ అవినీతి తిమింగలం ఆటకట్టించినట్లు తెలిసింది.