‘అవినీతి’ రఘు: అనంతలో 75ఎకరాలు, ఆరుగురు బినామీలు, 550కోట్లపైనే..
అనంతపురం/విశాఖపట్నం: టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంచాలకుడు గొల్ల వెంకట రఘు అక్రమాస్తులు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా రఘు బినామీలు భాగస్వాములుగా ఉన్న ఎస్పీఎస్ ఇన్ఫ్రా సంస్థ పేరిట 81 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు మంగళవారం గుర్తించారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లుగా భావిస్తున్నారు. పటాన్చెరు మండలం పటిఘన్పూర్ గ్రామంలో అవుటర్ రింగ్రోడ్డును ఆనుకుని ఆరు ఎకరాలు, అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో 75 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు.
షాక్: అవినీతి అనకొండలకు ఆ ఇద్దరు మంత్రుల అండ!(పిక్చర్స్)
ఆరుగురు అవినీతి భాగస్వాములు
2012 సంవత్సరంలో రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్స్ వద్ద ఎస్పీఎస్ ఇన్ఫ్రా సంస్థను నమోదు చేయించారు. ఈ సంస్థలో మొత్తం ఆరుగురు భాగస్వాములు ఉండగా వారిలో బసివిరెడ్డిగారి కళావతమ్మ, చాగంటి గోవిందరాజు- రఘు బినామీలుగా ఏసీబీ భావిస్తోంది. కళావతమ్మ.. రఘుకు స్వయనా అత్త. వీరిద్దరికి సంస్థలో రూ.6.40 కోట్ల విలువైన 33 శాతం వాటా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ లెక్కన వీరి వాటా కింద సుమారు 26 ఎకరాలు భూమి ఉంటుందని, దాని మార్కెట్ విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తోంది.
Recommended Video
అక్రమాల గోవిందరాజు హాజరు
రఘు విశాఖపట్నంలో పని చేసినపుడు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ)గా పని చేస్తున్న గోవిందరాజు అతడికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించాడు. నగరంలో తన అక్రమ వ్యవహరాలన్నింటినీ గోవిందరాజులు ద్వారానే అతడు నడిపించేవాడని ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. సెప్టెంబర్ 25న రఘు అక్రమార్జనకు సంబంధించి వారు మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసినపుడు గోవిందరాజు ఫ్లాట్లో సోదాలు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అతడు లేకపోవడంతో వారు ఆ ఇంటిని సీజ్ చేశారు. ఆనాటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేయడానికి కాదని... కేవలం ఇంట్లో సోదాలు చేస్తామని, రఘుకు సంబంధించిన ఆస్తులు గుర్తించడం మినహా మిగిలిన అంశాల జోలికిపోమని ఏసీబీ సంకేతాలివ్వడంతో గోవిందరాజు ఎట్టకేలకు ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యాడు.
రూ.550కోట్ల అక్రమాస్తులు...
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విశాఖలో వాల్తేరు అప్ల్యాండ్స్ శ్రీప్రకాష్ పాఠశాల సమీపాన ఎంవీవీ రాయల్ అపార్టుమెంట్లోని అతడి 901 ఫ్లాట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ దొరికిన పత్రాల ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగా ‘ఎస్పీఎస్ ఇన్ఫ్రా' అనే సంస్థను రఘు, గోవిందరాజు ఏర్పాటుచేసినట్లు గుర్తించారు. ఈ సంస్థ వ్యవహారాల్ని రామ్మూర్తి అనే వ్యక్తి ఎండీ హోదాలో పర్యవేక్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్మూర్తితోపాటు, ఇతర డైరెక్టర్లు ఎవరు? వారికి రఘుకు సంబంధం ఏమిటి? తదితర వివరాలను దర్యాప్తు చేస్తున్నారు. ఆయా భూములను సంస్థ ఎండీ రామ్మూర్తి పేరిట కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. ఆస్తుల పుస్తక విలువ రూ.6 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. వాటితోపాటు, గోవిందరాజుకు సంబంధించి మరికొన్ని ఆస్తులను గుర్తించామన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకూ బయటపడ్డ రఘు అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ.550 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దాఖలైన మెమోలు..
బినామీ కంపెనీలు పెద్ద ఎత్తున వెలుగుచూస్తుండటం, రూ.కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడుతుండటంతో రఘు, అతని బినామీల ద్వారానే వాటి గుట్టు తెలుసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా నల్లూరి వెంకట శివప్రసాద్, గాయత్రిలను నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. రఘు కస్టడీ కోరుతూ విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం మెమో దాఖలు చేయనున్నారు.