ఏపీలో ఏసీబీ మెరుపు దాడులు- ఏడు జిల్లాల్లో తహసీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు..
ఏపీలో అవినీతి నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్న వైసీపీ సర్కారు.. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏసీబీని పటిష్టం చేయడంతో పాటు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి తాజాగా ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక తెప్పించుకుని మరీ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఇవాళ తొలి దశలో రెవెన్యూశాఖపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఇవాళ ఏపీలోని ఏడు జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు చేపట్టింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ దాడులు ఉదయం నుంచీ కొనసాగుతున్నాయి. ఇందులో అనధికారికంగా అధికారులు తమ వద్ద ఉంచుకున్న నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేస్తున్నారు.
ఉదయం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయంపై జరిపిన దాడుల్లో దాదాపు 3 లక్షల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యమయ్యాయి. మరో ఉద్యోగి నుంచి లక్ష స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, విశాఖ జిల్లా కసింకోట, ప్రకాశం జిల్లా ఉలవపాడు, గుంటూరు జిల్లా రాజుపాలెం, శ్రీకాకుళం జిల్లా బలిజపేట తహసీల్దార్ కార్యాలయాల్లోనూ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. రెవెన్యూశాఖలో భారీ ఎత్తున సంస్కరణలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అధికారుల అవినీతి అడ్డంకిగా మారినట్లు భావిస్తున్న ప్రభుత్వం వరుస దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.