పాలరాతి బిల్డింగ్, కోట్ల ఆస్తులు, తుపాకీ: 'రియల్ డాన్' సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ మధురపూడి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో గురువారం ఉదయం ఏసిబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏకకాలంలో 13 చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. మూడు రోజుల క్రితమే సోదాల కోసం అధికారులు సిద్ధమయ్యారు.
కానీ, సోమవారం ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా.. అంతకుమునుపే సమాచారం అందుకున్న సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో, మూడు రోజుల పాటు వేచి చూసిన అధికారులు గురువారం తాళం పగులగొట్టి తనిఖీలు చేపట్టారు.
మధురపూడి సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. విశాఖ, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆయనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
కోట్లాది రూపాయల అక్రమ సంపాదన బయటపడుతోంది. వందలాది ఎకరాల భూమి కూడా ఆయనకు ఉంది. ఆయన కుటుంబ సభ్యుల, బినామీల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.రెండు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.
ఈ సోదాల్లో కోట్లాది రూపాయల అక్రమాస్తులకు పైగా బయటపడినట్లుగా తెలుస్తోంది. డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. అతని పేరిట, బినామీల పేరిట వందల ఎకరాల భూములు, భారీ భవంతులు గుర్తించారని తెలుస్తోంది.
రియాల్టర్లు, రౌడీషీటర్లతో కలిసి రియల్ డాన్!
ఆనంద్ కుమార్ రియాల్టర్లు, రౌడీ షీటర్లతో కలిసి రియల్ ఎస్టేట్ డాన్గా ఎదిగి భూముల పైన పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అతని ఇంట్లో తుపాకీ, గొడ్డలి, మారణాయుధాలు లభ్యమైనట్లుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఉన్న తుపాకీకీ లైసెన్స్ ఉందో లేదో తేల్చే పనిలో ఏసీబీ పడింది.
ఏసీబీ తనిఖీల్లో రూ.మూడు కోట్ల విలువైన పాలరాతి భవనం, డుప్లెక్స్ భవనం, ఎకరాల కొద్ది భూమి తదితరాలను గుర్తించారని తెలుస్తోంది. ఆనంద్ బినామీలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎకరాల కొద్ది భూములను వెంచర్లుగా మార్చి రియల్ ఎస్టేట్ దందా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.