విజయవాడ:ఎసిబి వలలో పొల్యూషన్ బోర్డ్ ఈఈ...భారీగా అక్రమాస్తులు గుర్తింపు
విజయవాడ :ఎసిబి వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా అనూహ్య దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ తాజాగా మరో అక్రమార్కుడి ఆటకట్టించింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారని అభియోగాలతో విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ కార్యాలయ ఈఈ సత్యనారాయణ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో రాజమండ్రి, హైదరాబాద్, నెల్లూరు లో సహా మొత్తం ఏడు చోట్ల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఎసిబి అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.
హైదరాబాద్ మాతృశ్రీ నగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పవన్ కుమార్ ఇంటిలో సోదాలు చేసి 5 కిలోల వెండి తో పాటు విలువైన డాక్యూమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే విజయవాడ, రాజమండ్రిలోని సత్యనారాయణ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల ఆస్తులను గుర్తించారు.
సత్యనారాయణ, అతని కుటుంబ సభ్యుల పేరిట 6 ఇళ్లు, 4 ఫ్లాట్లు, 4.44 ఎకరాల స్థలం,8.51 లక్షల నగదు, 52 లక్షల ఎఫ్డిలు, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండిని గుర్తించారు. మరో రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని ఎసిబి అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.