తిరుపతిలో అవినీతి అనకొండ: డిప్యూటీ ఈవోకు 30 ఇళ్లు, ఒక స్థలం విలువ కోటిన్నర
తిరుపతి: టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న టి.భూపతిరెడ్డి ఇంటిపై మంగళవారం రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. భూపతిరెడ్డి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
ఇప్పటివరకు చేసిన సోదాల్లో భూపతిరెడ్డి ఆస్తులు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ ఉన్నట్లు గుర్తించామని, ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో సోమవారం ఏకకాలంలో భూపతిరెడ్డితోపాటు అతని కుమారులు, తమ్ముడి ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా ఆస్తిపత్రాలు, ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం, స్థానిక చిన్న ఆలయాల డిప్యూటీ ఈవోగా భూపతిరెడ్డి పనిచేస్తున్నారు. ఈయన స్థానిక బైరాగిపట్టెడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు గత రెండు నెలలుగా అతనిపై నిఘా ఏసీబీ అధికారులు ఉంచారు.
సోమవారం జరిపిన దాడుల్లో దాడుల్లో ఏసీబీ తిరుపతి డీఎస్పీ శంకర్రెడ్డి, నెల్లూరు డీఎస్పీ ప్రభాకర్, కడప డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. కర్ణాటక బెంగళూరులోని భూపతిరెడ్డి ఇద్దరి కుమారుల ఇళ్లపై అనంతపురం డీఎస్పీ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
అంతేకాదు భూపతిరెడ్డికి బెంగళూరు, తిరుపతిలో భారీగా స్థిరాస్తులు, రెండు బ్యాంక్లాకర్లు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోమవారం చేసిన సోదాల్లో ఇంటిలో 30 ఇళ్లు, స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటిలో 18 స్థలాలను అమ్మేశారని, ప్రస్తుతం 12 ఆస్తులు ఆయన వద్ద ఉంచుకున్నట్లు వివరించారు.
బంగారం, వెండి, నగదు భారీగా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఒక స్థలానికి సంబంధించి మార్కెట్ విలువ రూ.1.60 కోట్లు వరకు ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి స్థలాలు తిరుపతికి సమీపంలోని దామినేడు, అవిలాల, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో భారీగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
భూపతిరెడ్డి తమ్ముడు షణ్ముగరెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నారని, అతని ఇంటిలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే భూపతిరెడ్డి మాత్రం తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. టీటీడీ అధికారిగా పనిచేసినప్పుడు తాను ఏ తప్పు చేయలేదన్నారు.
తన కుమారులు విదేశాలలో ఉంటూ సంపాదించిన డబ్బుతోనే తాను ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. తనపై ఎవరో కుట్ర పన్ని తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు.